దుకాణంలో మాయమాటలతో.. ఫోన్‌పే మోసం.. ఏమైందో తెలస్తే షాక్‌! | - | Sakshi
Sakshi News home page

దుకాణంలో మాయమాటలతో.. ఫోన్‌పే మోసం.. ఏమైందో తెలస్తే షాక్‌!

Oct 21 2023 12:04 AM | Updated on Oct 21 2023 9:51 AM

- - Sakshi

సాక్షి, ఖమ్మం: పట్ట పగలు సినీ ఫక్కీలో దుండగుడు డబ్బులు కాజేశాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితుడు విస్తుపోయాడు. బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని కిరాణా దుకాణానికి ఒడిశాకు చెందిన వ్యక్తి సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చాడు. తన ఫోన్‌ ఇంటి దగ్గర మర్చిపోయానని, ‘మీ’ ఫోన్‌ ఇస్తే సరుకుల లిస్ట్‌ను ఇంట్లో వారిని అడిగి కనుక్కుంటానని నమ్మించాడు. దీంతో సదరు దుకాణ యజమాని ఫోన్‌ను సదరు వ్యక్తికి ఇచ్చి దుకాణంలో సరుకులు కడుతున్నాడు.

ఇదే అదునుగా ఫోన్‌ మాట్లాడినట్లు నటించి ఫోన్‌ పే ద్వారా (పాస్‌వర్డ్‌ సులభంగా ఉండటంతో) రూ.72,500 కాజేశాడు. అనంతరం సదరు మోసగాడు సరుకుల లిస్టు ఇంటి దగ్గర ఉందని, వెంటనే వెళ్లి తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ తరువాత దుకాణ యజమాని ఫోన్‌ను పరిశీలిస్తే ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపినట్లు మెసేజ్‌ వచ్చింది. వెంటనే మోసపోయినట్లు గ్రహించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అందులోని పూర్తి వివరాలు పరిశీలిస్తే ఒడిశాకు చెందిన వ్యక్తిగా చూపిస్తోందని బాధితుడు గెల్లా వాసు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement