హొసపేటె: ప్రస్తుత వర్షాకాలంలో విజయనగర జిల్లా తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కొంటోంది. జిల్లా తీవ్ర కరువుతో అల్లాడుతోంది. జూన్ 1 నుంచి ఆగస్టు 6 వరకు సాధారణ వర్షపాతం 188.7 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైంది. ఇది 60 శాతం వర్షపాత లోటును సూచిస్తున్న నేపథ్యంలో రైతులకు సాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని జిల్లా ఇంచార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఆయన జిల్లాలో కరువు అధ్యయనం నిర్వహించి, జిల్లాధికారి కార్యాలయ హాలులో అధికారులతో సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరువు అధ్యయనం చేపట్టి, ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. రైతుల రుణాల మాఫీ విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని రైతులకు తెలిపారు. జిల్లా స్థాయిలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేయాలని జిల్లాధికారిని ఆదేశించారు. జలాశయంలో నీరు అందుబాటులో ఉన్నందున తాగునీటికి ఎలాంటి సమస్య ఉండదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 56 ప్రైవేట్ బోరుబావుల నుంచి నీటి సరఫరా జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో హరపనహళ్లి ఎమ్మెల్యే లతా మల్లికార్జున, హడగలి ఎమ్మెల్యే కృష్ణానాయక్, జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి, జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి నోంగ్జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా, ఎస్పీ జాహ్నవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కరువు నివారణకు జిల్లా
యంత్రాంగం సన్నద్ధం
జిల్లా ఇంచార్జి మంత్రి
జమీర్ అహ్మద్ ఖాన్


