రాయచూరు రూరల్ : నగర ప్రాంతాల్లో సీహెచ్ పౌడర్ విక్రయించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ అరుణాంగ్శుగిరి వెల్లడించారు. సోమవారం రాత్రి ఎస్పీ తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నగరంలోని గద్వాల రహదారి వీరాంజనేయ దేవస్థానం వద్ద కెంచప్పను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుని వద్ద నుంచి 153 లీటర్ల కల్తీ కల్లును, 203 లీటర్ల సీహెచ్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనపరుచుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో గుండెపోటుతో మహిళ మృతి
రాయచూరు రూరల్ : ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సమయంలో గుండెపోటుతో ఓ మహిళ మృతి చెందిన ఘటన బాగల్కోటెలో చోటు చేసుకుంది. మంగళవారం బాగల్కోటె వాజ్పేయి కాలనీకి చెందిన తుప్పద ఫాతిమా(61) కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి వెళ్లిన సమయంలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలింది.
విషాహారం తిని 40 మందికి అస్వస్థత
సాక్షి బళ్లారి: బీదర్ జిల్లా భాల్కి తాలూకా జాన్సీ గ్రామంలో కలుషిత ఆహారం తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం బాంతి గ్రామంలోని రాజ్కుమార్ అనే వ్యక్తి సొంత ఇల్లు కడుతున్న నేపథ్యంలో ఇంటి ఫైకప్పు స్లాబ్ వేసే సమయంలో సంతోషంగా అన్నం, సాంబారు, పాయసంతో కూడిన భోజనం ఏర్పాటు చేసి వంద మందికిపైగా ఆహ్వానించి భోజనాలు వడ్డించారు. భోజనం తిన్న కొంత సేపటికి 40 మందికి పైగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో అందరూ భయంతో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. భోజనం కలుషితమైన కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు పేర్కొన్నారు.
ఖాళీ ఉద్యోగాల భర్తీకి డిమాండ్
బళ్లారిటౌన్: ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కర్ణాటక దళిత సంఘర్షణ సమితి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పత్రికా భవనంలో సమితి రాష్ట్ర కన్వీనర్ ఎం.గురుమూర్తి తదితరులు మాట్లాడుతూ రోస్టర్ పద్ధతిని సరి చేసి కుల వర్గీకరణ తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమూర్తి హెచ్ఎస్ నాగమోహన్ దాస్ కమిషన్ సిఫార్సు మేరకు సంచార జాతులకు ప్రస్తుతం కేటాయించిన 17 శాతంలో ఒక శాతం రిజర్వేషన్ కల్పించేలా కొత్త ఆదేశాలను అము చేయాలని డిమాండ్ చేశారు. 56 శాతం రిజర్వేషన్లు కల్పించినందున ఇతర సముదాయాల్లో సమస్యలు ఉద్భవించిన వాటిపై కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో నేతలు శ్రీధర్, హనుమంతప్ప, గోవర్ధన్ పాల్గొన్నారు.
బాలల స్నేహి పోలీస్ స్టేషన్ ప్రారంభం
రాయచూరు రూరల్ : నేటి ఆధునిక యుగంలో సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా తల్లిదండ్రులు పిల్లల సంరక్షణకు ముందుండాలని కలబుర్గి ఎస్పీ ఏ.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం కలబుర్గి జిల్లా ఆళంద పోలీస్ స్టేషన్లో సన్మి త్ర సహాయవాణి, బాలల స్నేహి పోలీస్ స్టేషన్, మహిళా సహాయవాణి కేంద్రాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. నేడు మహిళలు, పిల్లలపై దాడులు, దౌర్జన్యాలు అధికమవుతున్న తరుణంలో ఇలాంటి సహాయవాణి కేంద్రాల ద్వారా సహాయం పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు.


