హొసపేటె: అంతరించి పోతున్న జీవజాతులను రక్షించే నెపంతో హంపీ అభివృద్ధి ప్రాధికార సంస్థ సామాన్య ప్రజల ప్రాథమిక, మానవ హక్కులను హరించడాన్ని నిరసిస్తూ ఆనెగుంది రాజవంశస్థుల నాయకత్వంలో 15 గ్రామాల ప్రజలు, రైతులు, మహిళలు సోమవారం కొప్పళలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆనెగుంది ప్రాంతాన్ని హంపీ అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వారు జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆనెగుంది రాజవంశస్తులైన లలితారాణి శ్రీరంగదేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఇటీవల హంపీ అభివృద్ధి ప్రాధికార సంస్థ విధించిన కొన్ని నిబంధనలు, అక్కడి అధికారులు ఆనెగుంది ప్రజల జీవన, మానవ హక్కులను హరించి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు, చిన్న వ్యాపార దుకాణాలకు విద్యుత్ కనెక్షన్లు పొందడాన్ని కఠినతరం చేయడం, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం, గుడిసెలు, ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. హంపీ అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులు, అటవీ శాఖ, పోలీసు అధికారులు ఆనెగుంది ప్రజలను అనుమానంతో చూస్తున్నారని తెలిపారు. అక్రమ నిర్మాణాలు అనే నెపంతో మానవత్వం లేకుండా దుకాణాల ముఖ భాగాలు, ఇళ్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.


