దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలోని అమృతహళ్లి పోలీసులు భారీ ఎత్తున ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయిని స్వాధీనపరచుకుని ఆఫ్రికన్ని అరెస్టు చేశారు. వివరాలు.. నైజీరియాకు చెందిన పేపె మోరె పేయి(43) అనే డ్రగ్స్ నేరగాన్ని పట్టుకున్న పోలీసులు అతని వద్ద నుంచి సుమారు రూ.3 కోట్ల విలువ చేసే 3 కేజీల డ్రగ్స్, గంజాయిని జప్తు చేశారు. అమృతహళ్లి లో ఎండీఎంఏ క్రిస్టల్, గంజాయిని నిందితుడు విక్రయించేవాడు. రెండేళ్ల కిందట వ్యాపార వీసాతో ఇండియాకు వచ్చిన పేపె.. హెబ్బాళలోని టాటానగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదన కోసం డ్రగ్స్ వ్యాపారిగా మారాడు. కమ్మనహళ్లి లో మరో విదేశీ వ్యక్తి నుంచి ఎండీఎంఏను కొనుగోలు చేసి వస్త్ర వ్యాపారం పేరుతో నగరంలో సంచరిస్తూ విక్రయించేవాడు. డ్రగ్స్, ఓ స్కూటర్, మొబైళ్లు, కొంత నగదును సీజ్ చేశారు.
కావేరి నదిలో మెడికో గల్లంతు
● ముగ్గురు క్షేమం
మైసూరు: కావేరి నదిలో స్నానానికి దిగి ఒకరు గల్లంతు కాగా, ముగ్గురు యువకులు ప్రాణాలతో బయట పడిన ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాల తాలూకాలోని శివనసముద్ర దర్గా వెనుక భాగంలో జరిగింది. వివరాలు.. బెంగళూరులోని దయానంద సాగర్ మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు శివనసముద్ర వద్ద ప్రవహించే కావేరీ నది సందర్శనకు వచ్చారు. అక్కడ నది అందాలను చూసి పులకించిపోయారు. వీరిలో నందకుమార్, ప్రఫుల్, తుషార్, ప్రమోద్ అనే నలుగురు స్నానం చేయాలని నదిలోకి దిగారు. అయితే ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండగా నందకుమార్ నీటిలో కొట్టుకునిపోయాడు. మిగతా ముగ్గురిని స్థానికులు, కొళ్లెగాల అగ్నిమాపక కేంద్రం అధికారి అరుణ్కుమార్ సిబ్బంది కాపాడారు. గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు కొనసాగుతోంది.
జై కనక దుర్గా
మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామ చెరువు సమీపంలో వెలసిన దుర్గాదేవి దేవాలయంలో బుదవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని విశేషంగా పూలతో అలంకరించారు. అభిషేకంతో పాటు వేదమంత్ర పారాయణం నిర్వహించారు. హంసల మధ్యన కూర్చున్న భంగిమలో అమ్మవారిని పుష్పాలతో అలంకరించడం భక్తులను ముగ్ధుల్ని చేసింది. వందలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రజల కోసం పనిచేయండి
● ఉప లోకాయుక్త వీరప్ప
మండ్య: సామాన్య ప్రజల కోసం మంచి పనులు చేసేవారికి అవసరమైతే కాళ్లు కూడా మొక్కుతానని, కానీ అవినీతికి పాల్పడేవారికి ఉరి శిక్ష పడేలా చేస్తానని ఉపలోకాయుక్త బీ.వీరప్ప హెచ్చరించారు. బుధవారం మండ్య నగరంలోని అంబేడ్కర్ భవనంలో జిల్లా యంత్రాంగం నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన ప్రసంగిస్తూ కష్టపడి సంపాదించింది కొంత సొమ్మే అయినా సంతోషాన్ని ఇస్తుందని, అవినీతికి పాల్పడి ఎంత డబ్బు ఆర్జించినా మనశ్శాంతిని ఇవ్వదని అన్నారు. అధికారులు కానీ, ఎవరైనా కానీ ప్రజలకు మంచిచేస్తే పాదాభివందనాలు చేస్తానని, తప్పుడు పనులు చేస్తే మాత్రం ఉరిశిక్ష పడేలా చేస్తానని చెప్పారు. అవినీతి అనేది సామాన్యమైన రోగం కాదని, ఇది క్యాన్సర్ కంటే చాలా పెద్ద వ్యాధి అని అన్నారు. ఇది ఒక్కసారి వచ్చిందంటే నయం కాదని అన్నారు.
నైజీరియన్ అరెస్టు, రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్
నైజీరియన్ అరెస్టు, రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్
నైజీరియన్ అరెస్టు, రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్