
కమల్హాసన్ దిష్టిబొమ్మ దగ్ధం
మండ్య: కన్నడ భాషను అవమానిస్తూ మాట్లాడిన తమిళ నటుడు కమల్ హాసన్ సినిమా థగ్లైఫ్ను రాష్ట్రంలో విడుదల చేయకూడదని, ఆయన కన్నడిగులకు క్షమాపణలు చెప్పాలని కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈమేరకు నగరంలోని జేసీ సర్కిల్లో శుక్రవారం గుమిగూడిన కార్యకర్తలు కమల్హాసన్ చిత్రపటానికి నిప్పంటించి దహనం చేశారు. కన్నడిగుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు.
నిధుల దుర్వినియోగం
● మున్సిపల్ మేనేజర్ సస్పెన్షన్
దొడ్డబళ్లాపురం: ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలపై దావణగెరె జిల్లా మలెబెన్నూరు మున్సిపాలిటీ కార్యాలయ మేనేజర్ భజక్కనవర్ను సస్పెండ్ చేశారు. ఈ–ఖాతా ప్రక్రియలో అక్రమాలు చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని స్వంతానికి వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపించారు. ఆరోపణలు రుజువు కావడంతో భజక్కనవర్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ గంగాధరస్వామి ఆదేశాలు జారీ చేశారు.
కప్ గెలిస్తే సెలవు ఇవ్వాల్సిందే
● సీఎం సిద్దరామయ్యకు క్రికెట్ అభిమాని లేఖ
సాక్షి బెంగళూరు: ఏటా ఐపీఎల్ సందర్భంగా ‘ఈ సల కప్ నమ్దే’ అంటూ హోరెత్తిపోయి ఆ తర్వాత ఆర్సీబీ ప్రదర్శనతో నిరాశ చెందే కన్నడిగుల్లో ఈ పర్యాయం కొత్త జోష్ చోటు చేసుకుంటోంది. 18వ సీజన్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచిన ఆర్సీబీకి అభిమానుల మద్దతు భారీగా పెరిగింది. ఆర్సీబీ ఫైనల్లో గెలిచి సంబరాల్లో మునగాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిస్తే సెలవు కావాలంటూ బెళగావి జిల్లా గోకాక్కు చెందిన శివానంద మల్లన్నవర్ అనే యువకుడు సీఎం సిద్ధరామయ్యకు ఈ మేరకు లేఖ రాశాడు. ఆర్సీబీ ఫైనల్లో గెలుపొందితే ఏటా ‘ఆర్సీబీ ఫ్యాన్స్ పండుగ’ పేరిట ఉత్సవాలు జరపాలని, విజ్ఞప్తి చేశాడు.
కరెంటుకు విద్యార్థి బలి
దొడ్డబళ్లాపురం: విద్యుత్ షాక్తో టెన్త్ విద్యార్థి మృతి చెందిన సంఘటన చిక్కబళ్లాపుర తాలూకా దొడ్డకిరుకుంబి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాదేశ్(16) గురువారం 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. తన ఇంటి వద్ద ఇనుప కడ్డీతో డ్రైనేజీ పైప్ క్లీన్ చేస్తుండగా పైన ఉన్న విద్యుత్ తంతి తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. నందిగిరిధామ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
మంత్రిపై హనీట్రాప్ కేసులో డీజీపీకి సిట్ నివేదిక
బనశంకరి: సహకార శాఖ మంత్రి కేఎన్.రాజణ్ణపై హనీట్రాప్ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం దర్యాప్తు పూర్తి చేసి శుక్రవారం డీజీపీ ఎంఏ సలీంకు నివేదిక అందజేసింది. దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులకు ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కాలేదు. ఫిర్యాదుచేసిన మంత్రి రాజణ్ణ ఒకటి రెండు సార్లు తన కార్యాలయానికి యువతి వచ్చిందని, తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె చెంపపై కొట్టి పంపానని తెలిపారు. ఆమె జతలో గడ్డంతో ఉన్న యువకుడు కూడా వచ్చాడని తెలపగా, దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులకు ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు. అంతేగాక మంత్రి ఆప్తులు, గన్మ్యాన్, సెక్యూరిటీ, పీఏను విచారణ చేసినా ఎలాంటి సాక్ష్యాలు దొరకనందున దర్యాప్తు పూర్తి చేసిన సిట్ అధికారులు డీజీపీకి నివేదిక అందజేశారు.