
జిందాల్లో అగ్ని ప్రమాదం
●త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
సాక్షి బళ్లారి: దేశంలో పేరు గాంచిన స్టీల్ ఇండస్ట్రీ జిందాల్ పవర్ హౌస్లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం జిల్లాలోని తోరణగల్లు సమీపంలో వేలాది ఎకరాల్లో వెలసిన జిందాల్ స్టీల్ ప్లాంట్ ఆవరణలో ఉన్నఫళంగా పవర్ హౌస్లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఎలక్ట్రానిక్ వస్తులు పూర్తిగా కాలిపోయాయి. తక్షణం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పడంతో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. ఈ ఘటనపై తోరణగల్లు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.
క్లీనర్ దుర్మరణం
పెద్దవడుగూరు: అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో పెద్దవడుగూరు మండల పరిధిలోని కాశేపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఐషర్ వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఈ ప్రమాదంలో ఐషర్ వాహనం క్లీనర్ మహమ్మద్ (31) అనే వ్యక్తి మృతి చెందాడు. రాయచూరు నుంచి అనంతపురానికి సరుకులు తీసుకొని వచ్చి అన్లోడ్ చేసి తిరిగి రాయచూరుకు వెళ్తుండగా కాశేపల్లి టోల్ప్లాజా దాటగానే నిద్రమత్తులో ఐషర్ డ్రైవర్ ఖలీల్ ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఐషర్ క్లీనర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇతని స్వస్థలం కర్ణాటకలోని రాయచూరు జిల్లా మాన్వి అని తెలిసింది. పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
రాయచూరు రూరల్: మనిషి సంపూర్ణ ఆరోగ్య రక్షణకు యోగా దోహదపడుతుందని మాజీ ఇంజినీర్ వెంకటేష్ పేర్కొన్నారు. సోమవారం బిల్లవ మందిరంలో యోగా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. యోగాతో వ్యాధులను దూరం చేసుకోవచ్చన్నారు. శారీరకంగా, మానసికంగా ఎదుగుదలకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో మల్లికార్జున స్వామి, సత్యవతి, బూదెప్ప, సహదేవ్, భావన, నేత్ర, విజయలక్ష్మి, ప్రభాకర్లున్నారు.
డెంగీ కట్టడికి
ఏకతాటిపై కదలండి
రాయచూరు రూరల్: డెంగీ వ్యాధిని కట్టడి చేసేందుకు అందరూ కలిసి ముమ్మరంగా ప్రచారం చేపట్టాలని జిల్లా ఆరోగ్యాధికారి డాక్టర్ సురేంద్రబాబు పిలుపు ఇచ్చారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆరోగ్య శాఖ, నగరసభ ఆధ్వర్యంలో డెంగీ దినోత్సవంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిం చాలన్నారు. అందరిని ఏకతాటి పైకి తెచ్చి నలుగురితో సమానంగా కలిసి జీవించాలన్నారు. ఇంటి ముందు నీరు నిలవకుండా ముందుకు ప్రవహించేలా చూడాలన్నారు. ఇంటి మందు దోమలు రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. హెడ్ మాస్టర్ శ్రీనివాస్, నోడల్ అధికారులు చంద్రశేఖరయ్య, యఽశోద, ఆర్సీహెచ్ అధికారిణి నందిత, అరుణ, రాధిక, అనిత, అన్నపూర్ణలున్నారు.
యథేచ్ఛగా సంబరాలు..
8 మంది అరెస్ట్
రాయచూరు రూరల్: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో తమ జట్టు గెలుపుపై మితిమీరిన సంబరాలు చేసుకుంటున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన జిల్లాలోని మస్కి తాలూకాలో చోటు చేసుకుంది. మస్కి తాలూకా హసమకల్లో ఆర్సీబీ జట్టు విజయం సాధించిన రోజు రాత్రి 8 మంది ఆర్సీబీ అభిమానులు యథేచ్ఛగా సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చడంతో పాటు పెట్రోలు పోసిన యువకులు నడి రోడ్డుపై నిప్పంటించి అల్లరి చేసి న్యూసెన్స్ సృష్టించినందున పోలీసులు అరెస్ట్ చేశారు. సింధనూరు తాలూకా బళగానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరారెడ్డి తెలిపారు.
కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ధర్నా
రాయచూరు రూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలలకు కమిషనరేట్తో పాటు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సంఘం జిల్లాధ్యక్షుడు శ్రీశైల నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో నిరవధిక ధర్నా ప్రారంభించి మాట్లాడారు. నవోదయ, మొరార్జి దేశాయి, రాణి కిత్తూరు చెన్నమ్మ, మైనార్టీ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసి, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. జీఎఫ్, పీఎఫ్లను కూడా మంజూరు చేయాలని కోరారు.

జిందాల్లో అగ్ని ప్రమాదం

జిందాల్లో అగ్ని ప్రమాదం

జిందాల్లో అగ్ని ప్రమాదం