
నాల్వడి ఒడెయర్కు భారతరత్న ఇవ్వాలి
మైసూరు: ఆధునిక మైసూరు నిర్మాణం, అభివృద్ధిలో మైసూరు సంస్థానాన్ని పాలించిన మహారాజు నాల్వడి కృష్ణరాజ ఒడెయర్ సేవలు అపారమని చామరాజ నియోజకవర్గ ఎమ్మెల్యే కే.హరీష్గౌడ అన్నారు. మంగళవారం ఒడెయర్ 141వ జయంతి సందర్భంగా విఖ్యాత అంబావిలాస ప్యాలెస్ ముందు నివాళులు అర్పించారు. మైసూరు రాష్ట్రాన్ని దేశమే తిరిగి చూసేలా అభివృద్ధి పనులు చేశారన్నారు. విద్యా రంగానికి పెద్ద పీట వేసి 1916లో మైసూరు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పలు చోట్ల ఆస్పత్రులను తెరిచారన్నారు. ఒడెయర్ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జన్మదినం రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలన్నారు.
నిషేధిత పొగాకు
ఉత్పత్తుల సీజ్
యశవంతపుర: బెంగళూరు సీసీబీ పోలీసులు గౌడాన్పై దాడి చేసి రూ.61.82 లక్షలు విలువగల నిషేధిత పొగాకు, నికోటిన్ ఉత్పత్తులను సీజ్ చేశారు. తలఘట్టపుర పోలీసుస్టేషన్ పరిధిలోని కనకపుర మొయిన్ రోడ్డులోని గోదాములో సోదాలు చేశారు. పెద్దమొత్తంలో పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.61.82 లక్షలుగా అంచనా వేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు.
మరో ఘటనలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.70 వేల విలువగల ఈ సిగరెట్లు, హుక్కా ఫ్లేవర్లు, విదేశీ సిగరేట్ను స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఆర్బీఆర్ లేఔట్ సెకండ్స్టేజీలోని అంగడిలో అమ్ముతున్నట్లు తెలిసి దాడి చేశారు. 201 ఈ–సిగరెట్లు, 297 హుక్కా ఫ్లేవర్ల బాటిళ్లు లభించాయి. అంగడి యజమాని పరారయ్యాడు.
ట్రాఫిక్ ఉల్లంఘనులపై చలానాల జోరు
యశవంతపుర: ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘనులపై బెంగళూరు పశ్చిమ విభాగం పోలీసులు కార్యాచరణ చేసి 1408 కేసుల్లో రూ.7.38 లక్షల జరిమానాలను వసూలు చేశారు. సోమవారం 45 త్రిబుల్ రైడ్ కేసుల్లో రూ.22,500, 114 రాంగ్ రూట్ కేసుల్లో 58,500, 240 అక్రమ పార్కింగ్ కేసుల్లో రూ.1.36 లక్షలు, 210 నో ఎంట్రీ కేసుల్లో రూ.1.5 లక్షలు, ఇతరత్రా 795 అతిక్రమణల్లో రూ.4.16 లక్షలు జరిమానా విధించారు.
పొగరాయుళ్ల మీద
ప్రపంచ పోగాకు రహిత దినోత్సవాల సందర్భంగా బెంగళూరు నగర పోలీసులు మూడు రోజుల పాటు తనిఖీలు చేసి 11,507 కేసులను నమోదు చేసి రూ.21.19 లక్షలు జరిమానాలను వసూలు చేశారు. బహిరంగంగా ధూమపానం చేస్తున్నవారికి జరిమానాలు వేశారు. కాగా, నగరంలో పొగాకు వ్యతిరేక ర్యాలీలు జరిగాయి.
విద్యార్థుల డ్రగ్స్ దందా ●
● ఇద్దరు కేరళవాసుల అరెస్టు
బనశంకరి: గంజాయి విక్రయానికి పాల్పడుతున్న ఇద్దరు కేరళ విద్యార్థులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ.13 లక్షల విలువచేసే గంజాయి, హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ బి.దయానంద్ మంగళవారం తెలిపారు. నిందితులు బీబీఏ చదువుతూ సంపిగేహళ్లిలోని అపార్టుమెంటులో నివసించేవారు. దాడి చేసి పట్టుకుని 1200 గ్రాముల గంజాయి, 220 గ్రాముల హైడ్రో గంజాయి, 2 ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.13 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనావేశారు. విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదన కోసం డ్రగ్స్ను అమ్ముతున్నట్లు తెలిపారు.
ఎండీఎంఏ స్వాధీనం
బ్యాడరహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలోని విశ్వేశ్వరయ్య లేఔట్లో ఇద్దరు డ్రగ్స్ విక్రేతలను అరెస్ట్చేశారు. మండ్య జిల్లా బెళ్లూరు క్రాస్లో ఓ వ్యక్తి నుంచి గంజాయి, ఎండీఎంఏ క్రిస్టల్ను తక్కువ ధరతో కొని, బెంగళూరులో అమ్ముతున్నట్లు నిందితులు తెలిపారు. వీరి వద్ద నుంచి 1.9 కేజీల గంజాయి, 13.5 గ్రాముల ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు.

నాల్వడి ఒడెయర్కు భారతరత్న ఇవ్వాలి