విజయోత్సవం.. హృదయ విదారకం | - | Sakshi
Sakshi News home page

విజయోత్సవం.. హృదయ విదారకం

Jun 5 2025 9:29 AM | Updated on Jun 5 2025 9:29 AM

విజయో

విజయోత్సవం.. హృదయ విదారకం

బెంగళూరు చిన్నస్వామి మైదానం వద్ద తొక్కిసలాట

బనశంకరి: ఐపీఎల్‌ కప్‌ సొంతం చేసుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజయోత్సవం సిలికాన్‌ నగరంలో ఘోర విషాదాన్ని నింపింది. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ జట్టుకు సన్మానోత్సవం ఉండగా, కళ్లారా చూడాలని వేలాది మంది జనసాగరంలా తరలివచ్చారు. గేట్‌ –12 వద్ద వారిని నిలువరించడానికి పోలీసులు లాఠీచార్జీ చేయడం, జనం నలుదిక్కులా పరుగులు తీశారు, బ్యారికేడ్లను తోసివేసి గేట్లు విరగ్గొట్టి స్టేడియంలోకి చొరబడ్డారు. ఈ గందరగోళంలో తొక్కిసలాట సంభవించింది. ఒకరినొకరు తోసుకుంటూ తొక్కుకుంటూ వెళ్లడంతో పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. అరుపులు, కేకలు, ఏడుపులు మిన్నంటాయి. ఏం జరుగుతోందో ఎవరికీ తెలియలేదు. అనేకమంది స్పహ తప్పి పడిపోయారు. దీంతో జనమే బాధితులను చేతుల మీద, భుజాల మీద ఎత్తుకుని అంబులెన్సుల కోసం పరుగులు తీశారు. ఏదో యుద్ధ ప్రాంతంలోని ఘోర కలిలా మారిపోయింది. అచేతనంగా పడిపోయిన కొందరికి సీపీఆర్‌ కూడా చేయసాగారు. బాధితులను సమీప బౌరింగ్‌, వైదేహి, మాల్య ఆస్పత్రులకు తీసుకెళ్లారు. బాలిక, యువతీ యువకులు కలిసి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలామందికి కాళ్లు, చేతులు ఫ్రాక్చర్‌ అయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. చిన్న చిన్న గాయాలైన కొందరు చికిత్స తరువాత డిశ్చార్జి అయ్యారు. తమవారికి ఏమైందో తెలియక అనేకమంది బంధుమిత్రులు రోదిస్తూ పరుగులు తీశారు.

శివమొగ్గలో బైకిస్టు మృతి

శివమొగ్గ: శివమొగ్గ నగరంలో మంగళవారం రాత్రి యువకులు ఆర్‌సీబీ విజయోత్సవం జరుపుకొన్నారు. గోపి సర్కిల్లో వందలాది మంది పాల్గొన్నారు. ఈ సమయంలో తోపులాట జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఎడాపెడా బాదడంతో తలోదిక్కుకు పరుగులు తీశారు. కొంత మంది యువకులకు గాయాలయ్యాయి. అలాగే ఉషా నర్సింగ్‌ హోం సర్కిల్‌ సమీపంలో రెండు బైక్‌లు ఢీకొని ఓ బైకిస్టు దుర్మరణం చెందాడు, మరో ఇద్దరు యువకులు గాయపడి ఆస్పత్రిలో చేరారు.

14 ఏళ్లకే నూరేళ్లు

14 ఏళ్ల దివ్యాంశి అనే బాలిక కూడా మరణించింది. 9వ తరగతి చదివే బాలిక తల్లిదండ్రులు శివకుమార్‌, అశ్వినితో కలిసి ఆర్‌సీబీ టీంని చూడాలని స్టేడియానికి వచ్చింది. తొక్కిసలాటలో చిక్కి చనిపోయింది.

సీఎం పరామర్శ

బౌరింగ్‌ ఆసుపత్రికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య , హోంమంత్రి పరమేశ్వర్‌ చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రభుత్వమే వైద్యఖర్చులను భరిస్తుందని తెలిపారు. కొందరు యువకులు మాట్లాడుతూ స్టేడియం వద్ద కనీస ఏర్పాట్లు లేవని, స్టేడియం లోపలికి వెళ్తామంటే గేట్లు తీయలేదని, పైగా పోలీసులు లాఠీలతో కొట్టడంతో జనం పరిగెత్తారని ఆరోపించారు.

చిందులు వేస్తూ అభిమాని కన్నుమూత

దొడ్డబళ్లాపురం: ఆనందం పట్టలేక డ్యాన్సు చేస్తుండగా గుండెపోటుతో ఆర్‌సీబీ జట్టు అభిమాని మృతిచెందిన సంఘటన బెళగావి జిల్లా మూడలగి తాలూకా అవరాది గ్రామంలో చోటుచేసుకుంది. మంజునాథ్‌ ఈశ్వర్‌ కంబార్‌ (28) ముందునుంచి ఆర్‌సీబీ అంటే అభిమానించేవాడు, ఈసారైనా విజేత కావాలని తపించేవాడు. మంగళవారం రాత్రి ఆర్‌సీబీ గెలుపు తరువాత సంబరాలలో మంజునాథ్‌ చిందులు వేస్తూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. కంబార్‌కు భార్య, ఆరునెలల కూతురు ఉన్నారు.

2 స్టేషన్లలో మెట్రో

సర్వీసులకు బ్రేక్‌

బనశంకరి: ఆర్‌సీబీ విజయోత్సవానికి వేలాది మంది తరలిరావడం, తొక్కిసలాట విషాదం నేపథ్యంలో విధానసౌధ, కబ్బన్‌పార్కు మెట్రో స్టేషన్లలో రైలు సర్వీసులను బీఎంఆర్‌సీఎల్‌ నిలిపివేసింది. బుధవారం సాయంత్రం 4.30 నుంచి ఈ రెండు స్టేషన్లలో మెట్రో రైళ్లను ఆపలేదు. టోకెన్‌, క్యూఆర్‌ టికెట్‌ పంపిణీ బంద్‌ అయ్యింది. దీంతో ప్రజలు సర్‌ఎం.విశ్వేశ్వరయ్య మెట్రోస్టేషన్‌, ఎంజీ.రోడ్డు స్టేషన్లలో దిగి వెళ్లారు. ఈ రెండు స్టేషన్లలో నిలబడలేనంత రద్దీ ఏర్పడింది.

ఆర్‌సీబీ ఆటగాళ్లను చూడాలని

జనం ఉబలాటం

11 మంది దుర్మరణం

33 మందికి పైగా గాయాలు

విజయోత్సవం.. హృదయ విదారకం1
1/2

విజయోత్సవం.. హృదయ విదారకం

విజయోత్సవం.. హృదయ విదారకం2
2/2

విజయోత్సవం.. హృదయ విదారకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement