
ఇంటి పైకప్పు కూలి మహిళ మృతి
హుబ్లీ: నిరంతర వర్షాలతో ఇంటి పైకప్పు కూలి ఓ మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి విజయపుర జిల్లా తికోటా తాలూకా బాబానగర్లో జరిగింది. పైకప్పు కూలడంతో ఇంట్లో నిద్ర పోతున్న సంగీత(30) అనే మహిళ మృత్యువాత పడింది. వర్షానికి ఇల్లు కారడంతో తక్షణమే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆమె భర్త, పిల్లలు అదృష్టవశాత్తు బయటపడ్డారని, ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టినట్లు తికోటా పోలీసులు తెలిపారు.
పిడుగుపాటుకు రైతు మృతి
హొసపేటె: జిల్లాలోని హగరిబొమ్మనహళ్లి తాలూకా దశమాపుర గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ రైతు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. మృతుడిని కే.చంద్రు(28) అనే రైతుగా గుర్తించారు. పొలంలో పని చేస్తుండగా చంద్రు మరణించగా, హగరిబొమ్మనహళ్లి రెవెన్యూ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
11న అవార్డుల ప్రదానోత్సవం
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవారలో ఈనెల11న చుక్కి ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం ఏర్పాటు చేసినట్లు చుక్కి ఫౌండేషన్ అధ్యక్షుడు శివానంద తెలిపారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమాపతి చుక్కి 49వ వర్ధంతి సందర్భంగా ఉత్తమ రచయితలను ఎంపిక చేసి వారిని సన్మానిస్తున్నట్లు తెలిపారు. సభ్యులు శివకుమార్, మల్లికార్జున, పరమేశ్వర సాలిమఠలున్నారు.
రైల్వే భద్రతపై
రాష్ట్ర స్థాయి సమావేశం
హుబ్లీ: రోజు నాలుగు కోట్లకు పైగా ప్రయాణికులను మోసుకెళ్లే రైలు రవాణా సురక్షత విస్తరణకు కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక ప్రాధ్యానతతో పాటు ప్రైవేటీకరణ ప్రక్రియను కట్టడి చేయాలని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ కే.హేమలత సూచించారు. జేసీ నగర్ అక్కన బళగలో సదరు సంఘం రాష్ట్ర కమిటీ చేపట్టిన రైల్వే సురక్షత రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైళ్ల సంచారం ప్రమాద రహితంగా, అలాగే సామాన్య ప్రజలు అనుకూలంగా ఉండాలన్నారు. ఈ విషయంలో శాశ్వత సిబ్బంది నియామకం, మౌలిక సదుపాయాలతో రైలు పట్టాలు, స్టేషన్లను ఆధునికీకరణ చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు 10 డిమాండ్లను ఈ సందర్భంగా ప్రతిపాదించారు. రైల్వే ప్రైవేటీకరణ పరిణామాల గురించి ప్రచార ఆందోళన జూలై, ఆగస్టుల్లో రైల్వే విభాగ స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. సామాన్య ప్రజల సంతకాల సేకరణతో ప్రధానికి వినతిపత్రం సమర్పించడం, ఆగస్టు 1, 3వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి ప్రధానికి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి మీనాక్షి, కాంతరాజు, మంజునాథ్, సునంద చిగరి తదితరులు పాల్గొన్నారు.
పేదలకు హోమియో వైద్య శిబిరం
హుబ్లీ: సుత్తూరులోని శ్రీసత్యసాయి హోమియోపతిక్ వైద్య కళాశాల, ఆస్పత్రి, డాక్టర్ శరణప్ప కోటగి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడాదంతా పేదలకు ఉచిత ఆరోగ్య వైద్య చికిత్స శిబిరం చేపట్టారు. ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య సేవలు అందించే దిశలో శ్రీబసవేశ్వర రూరల్ ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ట్రస్ట్ ద్వారా ఆస్పత్రిలో బయట రోగులకు, అలాగే లోపల రోగులకు ఈ సౌకర్యాలు లభిస్తాయి. నిపుణులైన వైద్యులు రక్త, బీపీ, చక్కెర, మూత్రం, ఎక్స్రే, స్క్యానింగ్ తదితర పరీక్షలను నిర్వహిస్తారు. అలర్జీ, దగ్గు, జలుబు, జ్వరం, పచ్చకామెర్లు తదితరాలతో పాటు మోకాళ్లు, కీళ్ల నొప్పులకు పేదలకు రాయితీ ధరలతో ఔషధాలు అందజేస్తామని ట్రస్ట్ అధ్యక్షుడు శరణప్ప కోటగి ఓ ప్రకటనలో కోరారు. ఆసక్తిగల వారు 8970731422, 9448128062లో సంప్రదించి ఉచిత వైద్య చికిత్సలు పొందాలని ఆయన సూచించారు.

ఇంటి పైకప్పు కూలి మహిళ మృతి

ఇంటి పైకప్పు కూలి మహిళ మృతి