
రూ.150 కోట్ల భూమి కబ్జా
బనశంకరి: కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమి భూకబ్జాదారుల పాలైందని బీజేపీ నేత ఎన్ఆర్ రమేశ్ బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ జగదీశ్కు ఫిర్యాదు చేశారు. రమేశ్ మాట్లాడుతూ.. దక్షిణ తాలూకా ఉత్తరహళ్లి హోబళి, తలఘట్టపుర గ్రామ సర్వే నంబరు– 30లో 11.16 ఎకరాలు బండ ప్రదేశం కాగా, పూర్తిగా ప్రభుత్వ ఆస్తి. సదరు ఆస్తి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.150 కోట్ల కు పైగా ఉంటుంది. ఓ బడా భూకబ్జాదారు దక్షిణ తాలూకా తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి భారీగా లంచాలు ఇచ్చి ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని ఆరోపించారు. సదరు భూమిని కాపాడుకోవలసిన బాధ్యత ఉందని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆక్రమణకు సహకరించిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరారు.