హొసపేటె: జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పాఠశాలలు ప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠశాలలకు పుస్తకాల పంపిణీపై దృష్టి పెట్టింది. సోమవారం నగరంలోని జిల్లా విద్యా శాఖ కార్యాలయం వద్ద ఉన్న ప్రభుత్వ పీవీబీఎస్ పాఠశాలలో ఆయా పాఠశాలలకు సంబంధించిన పుస్తకాలను విద్యాశాఖ అధికారి రాజు దగ్గర ఉండి ఆయా పాఠశాల హెచ్ఎంలకు అందజేశారు. ప్రైమరీ నుంచి హైస్కూల్ స్థాయి వరకు ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ ప్రకారం అందజేశారు. ఇప్పటికే 92 శాతానికి పైగా పాఠశాలలకు పుస్తకాలను పంపిణీ పూర్తయినట్లు ఆయన తెలిపారు.
బస్సు సౌకర్య లేమి..
విద్యార్థులకు తప్పని నడక
రాయచూరు రూరల్: జిల్లాలో పాఠశాలలు ప్రారంభమై 10 రోజులు గడిచినా గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాల్లో విద్యనభ్యసించడానికి రవాణ సౌకర్యం కొరత అధికమైంది. మస్కి తాలూకా కవితాళ మండల కేంద్రానికి చేరడానికి విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాలూకాలోని నెలకోళ, కాచాపుర, యాతగల్లకు చెందిన 80 మంది విద్యార్థులు అమీన్ గడ, హట్టి, నీలగల్, లింగసూగూరులకు వెళ్లాలంటే 7 కిలోమీటర్ల దూరం కాలి నడకన ప్రయాణం చేస్తున్నారు. శాసన సభ్యులు బసన గౌడ, మానప్ప వజ్జల్, హంపయ్య నాయక్లు ఈ సమస్యపై మౌనం వహిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు.
11 మంది మృతికి
సర్కారుదే బాధ్యత
హొసపేటె: బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించిన ఘటనకు రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ భయంకరమైన విషాదానికి వ్యతిరేకంగా విజయనగరం జిల్లా హొసపేటె తాలూకాలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద బీజేపీ నిరసన తెలిపింది. విజయోత్సవాన్ని జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో సరైన ఏర్పాట్లు లేక తొక్కిసలాట జరిగి అమాయకులు మృత్యువాత పడ్డారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్, హోం మంత్రి పరమేశ్వర నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. తమ తప్పులను దాచుకోడానికి అధికారులను బాధ్యులను చేశారని బీజేపీ నేతలు రూపేష్, అశోక జీరిగె ఆరోపించారు.
ప్రభుత్వమే జొన్నలు
కొనుగోలు చేయాలి
రాయచూరు రూరల్: రైతులు ఖరీఫ్ సీజన్లో పండించిన జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు ఉన్నఫళంగా కొనుగోలు కేంద్రాలను మూసివేసి జొన్నల కొనుగోళ్లను నిరాకరించడాన్ని తప్పుబట్టారు. రైతులు మార్కెట్కు తెచ్చిన జొన్నలు కొనుగోలు చేయాలని కేంద్రం వద్ద విన్నవించుకున్నా అధికారులు బేఖాతరు చేశారన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఈనెల 13న వ్యవసాయ వర్సిటీలో రైతు సంఘం నేత చెన్నబసప్ప బెట్టదూరు అధ్యయన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు.
సస్పెన్షన్పై నిరసన
బళ్లారి అర్బన్: బెంగళూరు పోలీస్ కమిషనర్ బీ.దయానందను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం సరికాదు, తక్షణమే పునర్ నియామకం చేపట్టాలని వాల్మీకి ప్రముఖులు డిమాండ్ చేశారు. సోమవారం కర్ణాటక పీడిత తాడిత వర్గాల మహా ఒక్కూట బళ్లారి శాఖ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఉత్తమ అధికారిగా పేరుగాంచిన దయానందను ఆర్సీబీ విజయోత్సవాల వేళ జరిగిన దురంతానికి బాధ్యున్ని చేసి సస్పెండ్ చేయడం తగదన్నారు. వీకే బసప్ప, మానయ్య, విజయ్ శివశంకర్, కే.హనుమంతప్ప, ఇమామ్ గోడేకర తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలకు పుస్తకాల పంపిణీ
పాఠశాలలకు పుస్తకాల పంపిణీ
పాఠశాలలకు పుస్తకాల పంపిణీ