
కలబుర్గిలో రైల్వే డివిజన్ కార్యాలయం ప్రారంభిస్తాం
రాయచూరు రూరల్: కలబుర్గిలో రైల్వే డివిజన్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ పేర్కొన్నారు. ఆదివారం కలబుర్గిలో అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న రైల్వే ఆధునికీకరణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాన్య ప్రజలకు అనుకూలమయ్యే విధంగా భారతీయ రైల్వే 10 వేలకు పైగా జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో వందే భారత్ రైలు సంచారం ఉందన్నారు. బెంగళూరు–బెళగావి మధ్య త్వరలో వందే భారత్ రైలు సంచారానికి చర్యలు తీసుకుంటామన్నారు. డీజిల్ ఇంజిన్లను తొలగించి విద్యుత్ రైళ్లను నడపడం వల్ల ఏడాదికి రూ.18 వేల కోట్లు ఆదా అవుతోందన్నారు. కమల్ హాసన్ కన్నడ భాషపై అవహేళనకరంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. కేంద్రం పేదలకు తక్కువ ఖర్చుతో మందులు లభించేలా ఏర్పాటు చేసిన జనౌషధి కేంద్రాలను మూసివేయరాదని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశానన్నారు. హేమావతి నీటి విడుదల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య దారి మళ్లారన్నారు. హేమావతి నీటిని రామనగరకు తీసుకెళ్లే పథకంలో రైతులపై కేసులు నమోదు చేయడం తగదన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మొండివాడిగా మారాడన్నారు. రైతులకు న్యాయం చేయకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ఈ విషయంపై గతంలో ముఖ్యమంత్రికి లేఖ రాసి హేమావతి నీటి విషయంలో రాజకీయాలు వీడి రైతులకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. నూతన పైపులైన్లు అమర్చుకోవాలన్నారు. హేమావతి నీటి పథకాన్ని వదిలి పెట్టాలని కోరామన్నారు.