
తొక్కిసలాట మృతులకు నివాళులు
మైసూరు: ఆర్సీబీ జట్టు విజయోత్సవం సందర్భంగా చిన్నస్వామి స్టేడియం గేట్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో అసువులుబాసిన వారికి శుక్రవారం నగరవాసులు నివాళులర్పించారు. చాముండిపురం సర్కిల్ వద్ద జనమన వేదిక , పాతి ఫౌండేషన్ , ఆరివు సంస్థ సభ్యులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.
లోకాయుక్తకు చిక్కిన అధికారులు
దొడ్డబళ్లాపురం: లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు లోకాయుక్తకు చిక్కారు. ఉడుపి బ్రహ్మవరకు చెందిన దినేష్ పూజారి అనే వ్యక్తి తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.అయితే కనెక్షన్ మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాలని ఉడుపి జిల్లా బ్రహ్మావర మెస్కాం అసిస్టెంట్ ఇంజినీర్ అశోక్ పూజారి డిమాండ్ చేశాడు. దదీంతో బాధితుడు లోకాయుక్తను ఆశ్రయించాడు. శుక్రవారం పథకం ప్రకారం కార్యాలంయలో రూ.20 వేల నగదు ఇస్తుండగా లోకాయుక్త పోలీసులు దాడిచేసి అశోక్ పూజారిని అరెస్ట్ చేశారు.
కేఐఏడీబీ సర్వే సూపర్వైజర్....
లంచం తీసుకుంటూ కేఐఏడీబీ సర్వే సూపర్వైజర్ లోకాయుక్తకు చిక్కాడు. బెంగళూరుకు చెందిన రవి అనే వ్యక్తి తన భూమికి సంబంధించిన స్కెచ్ను ఆమోదించాలని కేఐఏడీబీ సర్వే సూపర్ వైజర్ నరేంద్రకుమార్ను కోరాడు. అందుకు రూ.1.50 లక్షలు లంచం డిమాండు చేశాడు. దీంతో రవి లోకాయుక్తను ఆశ్రయించాడు. పథకం ప్రకారం నగదు అందజేస్తుండగా లోకాయుక్త పోలీసులు దాడి చేసి నరేంద్ర కుమార్ను అరెస్ట్ చేశారు.
పోలీస్ కమిషనర్ దయానంద్ సస్పెన్షన్ అన్యాయం
బనశంకరి: తొక్కిసలాట దుర్ఘటనలో 11 మంది మృతిచెందిన ఘటనకు సంబంధించి బెంగళూరు నగరపోలీస్కమిషనర్ బి.దయానంద్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఈమేరకు మడివాళ పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న నరసింహరాజు శుక్రవారం రాజ్భవన్కు వెళ్లి ధర్నాచేశారు. ప్రభుత్వ ఆదేశాలు ఖండిస్తూ చేతిలో డాక్టర్ అంబేడ్కర్ ఫొటో పట్టుకుని, నల్లదుస్తులు ధరించి రాజభవన్ ఎదురుగా ధర్నాకు దిగారు. విధానసౌధ పోలీసులు చేరుకుని హెడ్కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు.
సీఎం, డీసీఎం,
హోం మంత్రిపై బీజేపీ ఫిర్యాదు
బనశంకరి: చిన్నస్వామిస్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో 11 మంది మృతిచెందిన ఘటనకు సంబంధించి సీఎం సిద్దరామయ్య, డిప్యూటీసీఎం డీకే.శివకుమార్, హోంమంత్రి పరమేశ్వర్ కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం బెంగళూరు కబ్బన్పార్కు పోలీస్స్టేషన్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ.రాజీవ్ నేతృత్వంలోని కమిటీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్, అధికారప్రతినిధి అశ్వత్నారాయణ పాల్గొన్నారు.
ఇద్దరి అరెస్ట్
బనశంకరి: బెంగళూరు చిన్నస్వామిస్టేడియంలో సంభవించిన తొక్కిసలాట దుర్ఘటనకు సంబందించి ఇద్దరు స్టేడియం సిబ్బందిని శుక్రవారం కబ్బన్పార్కు పోలీసులు అరెస్ట్చేశారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో టికెట్ కౌంటర్లో విధులు నిర్వహించే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.