
కొత్వాలుగా సీమంత్కుమార్ సింగ్
బనశంకరి: బెంగళూరు నగర నూతన పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీమంత్కుమార్ నియమితులయ్యారు. చిన్నస్వామి తొక్కిసలాట ఘటనకు సంబంధించి నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో సీమంత్కుమార్సింగ్ను నియమించింది. ఈమేరకు గురువారం అర్ధరాత్రి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరించారు. సీమంత్కుమార్ సింగ్ శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, హోంమంత్రి పరమేశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అంతకు ముందు తన కార్యాలయంలో అధికారులతో నూతన కమిషనర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. నగరంలో ఇటీవల రౌడీకార్యకలాపాలు పెచ్చుమీరడం, ప్రజలను మారణాయుధాలతో బెదిరించడం, అమాయకులు, దుకాణాలపై దాడులు తదితర ఘటనలకు అడ్డుకట్టవేసి శాంతిభద్రతలు కాపాడాలన్నారు. బక్రీద్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్తచర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి విషయంలో సీనియర్ అధికారులతో సమాలోచనచేసి నిర్ణయం తీసుకోవాలని కమిషనర్ సీమంత్కుమార్సింగ్ సూచనచేశారు. చిన్నస్వామిస్టేడియంలో తొక్కిసలాట దుర్ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైందని, దర్యాప్తు బృందం ఇప్పటికే ఈ కేసుపై విచారణ ప్రారంభించిందన్నారు. బాధ్యులపై చట్టరీత్యాచర్యలు తీసు తీసుకుంటామన్నారు. నమోదైన కేసులను సీఐడీకి అప్పగించే ముందు తమ విధులు తాము నిర్వహిస్తామని తెలిపారు.

కొత్వాలుగా సీమంత్కుమార్ సింగ్