● శివమొగ్గ జిల్లాలో ఘటన
శివమొగ్గ: మద్యం మత్తులో మామ, అల్లుడు గొడవపడి అల్లుని హత్యకు దారితీసింది. శివమొగ్గ జిల్లాలోని సొరభ తాలూకాలోని ఆనవట్టి దగ్గర జరిగింది. వివరాలు.. అల్లుడు రవీంద్ర (26), మామ ఉమేష్ (45) 5వ తేదీన మద్యం తాగి, హోటల్కు భోజనానికి వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. ఆగ్రహం పట్టలేని మామ హోటల్లో ఉన్న కత్తెరను తీసుకొని అల్లుని ఎదలో పొడిచాడు. అల్లుడు విలవిలలాడుతుండగా మామ పరారయ్యాడు. స్థానికులు రవీంద్రను సొరభ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం శివమొగ్గ నగరంలోని మెగ్గాన్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం చనిపోయాడు. నిందితున్ని అరెస్టు చేసినట్లు సమాచారం.
సీఎం, డీసీఎం,
హోం మంత్రిదే బాధ్యత
● పోలీసులపై సస్పెన్షన్ సరికాదు
● రిటైర్డు ఐపీఎస్ భాస్కరరావు
మైసూరు: ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట కారణంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం యావత్ పోలీసు శాఖను నిర్వీర్యం చేసినట్లయిందని రిటైర్డ్ ఐపీఎస్, బీజేపీ నేత భాస్కరరావు ఆరోపించారు. శనివారం ఆయన మైసూరులో విలేకరులతో మాట్లాడారు. ఈ దురంతానికి సీఎం, డీసీఎం, హోం మంత్రి నేరుగా బాధ్యులని, అందువల్ల ఆ ముగ్గురు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. ఈ ముగ్గురి చేతులకు 11 మంది రక్తపు మరకలు అంటాయన్నారు. ఐపీఎల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ జట్టు గెలవడం ఒక పెద్ద శాపమని, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి హడావుడిగా కార్యక్రమం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఆర్సీబీ జట్టులో ఉన్నది ఇద్దరు కన్నడిగ ఆటగాళ్లు మాత్రమే, అయినా కన్నడిగుల భావోద్వేగాలు ఆ జట్టుపై అధికంగా ఉన్నాయని చెప్పారు. విజయోత్సవంలో కనీసం వంద అంబులెన్స్లు, స్ట్రెచర్లు, తాళ్లు, రద్దీ నియంత్రణ వస్తుసామగ్రి సిద్ధంగా పెట్టుకోవాల్సిందన్నారు. సస్పెన్షన్ ద్వారా పోలీసుల నైతిక స్థైర్యాన్ని సీఎం సిద్దరామయ్య కుంగదీశారన్నారు. ఐపీఎల్ వంటి ప్రైవేటు కార్యక్రమానికి డీసీఎం శివకుమార్ వెళ్లడమేంటి, కప్కు ముద్దు పెట్టడమేంటి అని హేళన చేశారు.
కృతికకు దక్కని ఊరట
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో రిటైర్డ్ డీజీపీ ఓంప్రకాశ్ హత్య కేసులో ముందస్తు బెయిలు కోరిన కుమార్తె పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. హత్య కేసులో కుమార్తె కృతిక మీద కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలువ్వాలని ఆమె బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు విచారించి కొట్టివేసింది. దీంతో కృతిక అరెస్టు తప్పదని తెలుస్తోంది. ఏప్రిల్ 20న ఓంప్రకాశ్ను ఆయన భార్య పల్లవి దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఆమె రిమాండులో ఉంది.
మామ చేతిలో అల్లుడు హతం
మామ చేతిలో అల్లుడు హతం