
కంపచెట్లు వేసి నిరసన
రాయచూరు రూరల్: నెలల తరబడి కష్టించినా బిల్లులు అందకపోవడంతో ఉపాధి కూలీల్లో ఆగ్రహం పెల్లుబుకింది. దీంతో కంపచెట్లను గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన శనివారం సుంకేశ్వర గ్రామంలో జరిగింది. కూలీలు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో రెండు నెలల క్రితం పూడిక తీసిన పనులు చేపట్టామన్నారు. అయితే నెలల తరబడి బిల్లులు చెల్లించలేదన్నారు. దీంతో తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. బిల్లులు చెల్లించాలని పలుమార్లు పంచాయతీ అధికారులకు విన్నవించినా స్పందించలేదన్నారు. విసుగు చెంది కార్యాలయానికి కంపచెట్లు వేసినట్లు తెలిపారు.