
చిక్కబళ్లాపురం: అదృశ్యమైన తల్లీ, ఆమె ఇద్దరు బిడ్డలు నీటిలో శవాలై తేలారు. ఈఘటన చిక్కబళ్లాపురం తాలూకా బాదగానహళ్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో జయణ్ణ, లావణ్య(30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నిహారిక(12), నేహా(9) అనే బిడ్డలు ఉన్నారు. ఏ కారణం చేతనో గురువారం సాయంత్రం నుంచి వీరు అదృశ్యం అయ్యారు.
కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించినా వారి జాడ లేదు. శుక్రవారం గ్రామ శివార్లలోని బావిలో ముగ్గురూ శవాలై తేలారు. స్థానికులు గమనించి ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, కుటుంబ సభ్యులు వచ్చి పరిశీలించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిది ఆత్మహత్య? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.