
శివమొగ్గలో కాల్పుల మోత
● అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగపై
పోలీసు కాల్పులు
శివమొగ్గ: అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర దోపిడీ దొంగపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈఘటన శుక్రవారం వేకువజామున శివమొగ్గ నగరంలో జరిగింది. బెంగళూరులోని కల్కెరెకు చెందిన మంజునాథ్ అలియాస్ మంజు(42)పై రౌడీషీట్ నమోదైంది. ఇతనిపై 72కుపైగా కేసులు ఉన్నాయి. అనేక దోపిడీ ఘటనల్లో ఇతను భాగస్వామి. చాలా రోజులుగా పోలీసుల కళ్లుగప్పి సంచరిస్తున్నాడు. శివమొగ్గ నగరానికి వచ్చినట్లు పక్కా సమాచారంతో శివమొగ్గ నగరంలోని జయనగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. సీఐ సిద్దెగౌడ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం వేకువజామున వేట మొదలు పెట్టారు. నిందితుడు ఉన్న చోటకు చేరుకున్నారు. లొంగిపోవాలని మంజుకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ద్యామప్ప అనే కానిస్టేబుల్పై మంజు మారణాయుధంతో దాడి చేశాడు. దీంతో ఆత్మరక్షణ కోసం సీఐ సిద్దేగౌడ సర్వీస్ రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా మంజు ఎదురుదాడికి యత్నించడంతో మళ్లీ కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ మంజు కాలిలోకి దూసుకెళ్లడంతో కుప్పకూలాడు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని మెగ్గాన్ ఆస్పత్రికి తరలించారు.
నేడు బ్లాక్ డే
దొడ్డబళ్లాపురం: చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు సంబంధించి కన్నడ భాషా ఉద్యమనేత వాటాళ్ నాగరాజు ఆధ్వర్యంలో శనివారం బ్లాక్ డే గా ఆచరించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12–30 గంటలకు బెంగళూరు మైసూరు బ్యాంక్ సర్కిల్లో బ్లాక్ డే ఆచరించనున్నట్టు ఆయన ప్రకటించారు. 11మంది మృతికి కారణం ఎవరని వాటాళ్ ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలను రాజకీయాలకు, రాజకీయ అవసరాలకు అతీతంగా ఆలోచించాలని ఆయన అన్నారు. ఆర్సీబీ విజయోత్సవాన్ని ఆచరించాలని ఎవరు నిర్ణయించారన్నారు.
తొక్కిసలాట మృతునికి
అశ్రునయనాలతో అంత్యక్రియలు
మండ్య : చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వద్ద జరగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మండ్య జిల్లాలోని కేఆర్పేటె తాలూకాలోని రాయసముద్ర గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చంద్ర కుమారుడు పూర్ణచంద్ర అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామం రాయసముద్రలో బంధువుల కన్నీటి మధ్య జరిగాయి. రాయసముద్రతోపాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి పూర్ణచంద్రకు కడసారి వీడ్కోలు పలికారు. ఎమ్మెల్యే హెచ్.టి.మంజు, ఆర్టీఓ మల్లికార్జున, తహసీల్దార్ ఎస్యూ ఆశోక్, విద్యాశాఖాధికారి తిమ్మేగౌడ వచ్చి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పూర్ణచంద్ర మృతి బాధాకరమన్నారు.

శివమొగ్గలో కాల్పుల మోత