
తొక్కిసలాటపై రాజకీయం చేయబోం
శివాజీనగర: బెంగళూరులోని చిన్నస్వామి క్రీడా మైదానం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాట ఘటనను తాము రాజకీయం చేసేందుకు ఇష్టపడబోమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత దేవరాజ అరసు 43వ వర్ధంతి సందర్భంగా విధానసౌధ ముందు భాగంలో ఉన్న అరసు ప్రతిమకు పుష్పాంజలి ఘటించిన తరువాత ఆయన మాట్లాడారు. తొక్కిసలాట ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేసి లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయి. తాను ఈ విషయంలో రాజకీయం చేయనబోన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీస్ అధికారులను బలిపశువులు చేశారని, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ నైతిక బాధ్యత వహించాలనే ప్రతిపక్షాల వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, ఎవరు బాధ్యతలు తీసుకొన్నా, బాధ్యతతో విధులు నిర్వహించాల్సింది. వారు నిర్లక్ష్యంతో విధులు నిర్వహించినందుకు చర్యలు తీసుకున్నామని పోలీస్ అధికారుల సస్పెన్షన్ను సమర్థించుకున్నారు. ఈ ఘటనపై అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి తగిన సమాధానం ఇవ్వటానికి ఇష్టపడలేదు.
దేవరాజు అరసు పేదల పక్షపాతి
అంతకు ముందు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత దేవరాజ అరసు కార్యశైలి, రాజకీయ విధానాలను శ్లాఘించారు. అరసు రాష్ట్రానికి చెందిన రాజకీయ చాణుక్యుల్లో ఒకరన్నారు. దేవరాజ అరసుకు పేదలు, అన్యాయానికి గురైన వారిపై అపారమైన ఆసక్తి ఉండేదన్నారు. అరసు పేదరిక నిర్మూలనకు కార్యక్రమాలను సక్రమంగా అమలుపరిచారన్నారు. ఆయన కాలంలో ఎలాంటి వర్గానికి రాజకీయ అవకాశాలు లభించలేదో అలాంటి వర్గాలను గుర్తించి రాజకీయ ప్రాతినిథ్యం కల్పించారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం హావనూరు కమిషన్ను నియమించి వెనుకబడిన వర్గానికి విద్య, ఉద్యోగంలో రిజర్వేషన్ కల్పించారన్నారు. అరసు పథకాలు తమకందరికి సదా స్ఫూర్తి అని సీఎం తెలిపారు.
సీఎం సిద్దరామయ్య