
సాహితీవేత్త హెచ్.ఎస్.వెంకటేశ్మూర్తి కన్నుమూత
శివాజీనగర: ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ హెచ్.ఎస్.వెంకటేశ్ మూర్తి (80) శుక్రవారం కన్నుమూశారు. వయస్సు పైబడిన వ్యాఽధితో బాధపతున్న ఆయన బెంగళూరులోని బీజీఎస్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అనేక సినిమాలకు పాటలు, కథ, సంభాషణ రాసిన ఆయన 85వ కన్నడ సాహిత్య సమ్మేళన అధ్యక్షుడయ్యారు. వెంకటేశమూర్తి మృతికి అనేక మంది ప్రముఖులు సంతాపం తెలిపారు. 1944 జూన్ 23న దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా హూదిగెరె గ్రామంలో జన్మించిన వెంకటేశ్మూర్తి.. కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి బీఏ, బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి కన్నడలో ఎం.ఏ పట్టాపొందారు. కన్నడలో పీహెచ్డీ చేశారు. 1973లో బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ వాణిజ్య కాలేజీలో కన్నడ అధ్యాపక వృత్తి ఆరంభించిన ఆయన 2000లో రిటైర్డ్ అయ్యారు. వెంకటేశమూర్తి పార్థీవదేహం అంతిమ దర్శనానికి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్ర వెను భాగం బయలు రంగమందిరంలో ఏర్పాటు చేశారు.
సీఎం సిద్దరామయ్య సంతాపం:
హెచ్.ఎస్.వెంకటేశ్మూర్తి కన్ను మూయటం బాధకు గురి చేసిందని సీఎం సిద్దరామయ్య ఎక్స్లో పోస్టు చేశారు. కవితలు, నాటకం, పిల్లల సాహిత్యం, అనువాదం ఇలా సాహిత్యంలో వివిధ రీతుల్లో నిమగ్నమై అపారమైన చదవరులను కలిగిఉన్న విశిష్ట రచయిత వెంకటేశమూర్తి మృతి సాహితీ లోకానికి తీరని లోటన్నారు. అదేవిధంగా హెచ్.ఎస్.వెంకటేశ్మూర్తి మృతికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంతాపం వ్యక్తం చేశారు. వేంకటేశమూర్తి సాహిత్య రంగానికి తనదైన సేవలు అందించారన్నారు.

సాహితీవేత్త హెచ్.ఎస్.వెంకటేశ్మూర్తి కన్నుమూత