
పేదలకు ఇళ్ల హక్కు పట్టాలిప్పిస్తాం
రాయచూరు రూరల్: మురికి వాడల్లో నివసించే పేదలకు ఇళ్ల హక్కు పట్టాలిప్పిస్తామని ఎమ్మెల్సీ వసంత్ కుమార్ వెల్లడించారు. శనివారం పండిట్ సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో మురికి వాడల క్రియా వేదిక ఆధ్వర్యంలో జరిగిన స్లం హబ్బను ప్రారంభించి మాట్లాడారు. గత 20 ఏళ్ల నుంచి మురికి వాడల ప్రాంతంలో నివసిస్తున్న వారికి నగరసభ అధికారులు, నగరాభివృద్ధి ప్రాధికార అధికారులతో చర్చించి సమస్యలకు పరిష్కారం కనుగొంటామన్నారు. నగరంలో నివసించే పేదల్లో 2024లో 1.64 లక్షల మందికి హక్కు పట్టాల పత్రాలను అందించారన్నారు. ఇళ్ల స్థలాలను కేటాయించాలని ఆర్డీఏ అధికారులతో ప్రతిపాదించి చర్యలు చేపడతామన్నారు. సర్కార్ మురికి వాడల ప్రజలకు ఇంటి హక్కు పట్టాలివ్వడానికి సిద్ధమన్నారు. అంతకు ముందు అంబేడ్కర్ సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి, పవన్ కుమార్, రజాక్ ఉస్తాద్, రవీంద్ర జాలదార్, అంబన్న, అనిల్, మురికి వాడల క్రియా వేదిక అధ్యక్షుడు జనార్దన్లున్నారు.