
క్రస్ట్గేట్ నిర్మాణ పనులపై నిరాసక్తి
హొసపేటె: తుంగభద్ర డ్యాం 32 క్రస్ట్గేట్ల భర్తీ పనులకు మళ్లీ టెండర్ పిలిచినా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఒక్క కంపెనీ కూడా దరఖాస్తు చేసుకోలేదు. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల కంపెనీలు మళ్లీ ఈ–టెండర్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. తుంగభద్ర డ్యాం గేట్లను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ఎన్డీటీ సర్వీస్ కంపెనీ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత నిపుణులు కూడా మార్పు అవసరమని చెప్పారు. అందువల్ల తుంగభద్ర బోర్డు 32 గేట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అప్పుడు కూడా నాలుగు కంపెనీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. సాంకేతిక కారణాల వల్ల, మళ్లీ టెండర్ పిలిచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇప్పుడు నాలుగు కంపెనీలు మాత్రమే దరఖాస్తులను సమర్పించాయి. గుజరాత్కు చెందిన అనార్ కంపెనీ, హార్డ్వేర్ టూల్స్, మెషినరీ ప్రాజెక్ట్ కంపెనీలు తుంగభద్ర డ్యాం 32 గేట్ల పునర్నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాయి.
తెలంగాణ నుంచి రెండు కంపెనీలు..
మరో వైపు తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వప్రా, బెకామ్ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పుడు సాంకేతిక బిడ్ తెరిచి ఉంది. రాబోయే రోజుల్లో టెండర్ ఎవరు దక్కించుకున్నారో తెలుస్తుందని తుంగభద్ర బోర్డు వర్గాలు తెలిపాయి. తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ల నిర్మాణంలో స్థానిక కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్ను కోరారు. అయితే తుంగభద్ర బోర్డు మళ్లీ టెండర్లు పిలిచినా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచి ఒక్క కంపెనీ కూడా దరఖాస్తు చేసుకోలేదు. జలాశయం క్రస్ట్గేట్ల నిర్మాణంలో అనుభవం, అర్హతలు కలిగిన ఏవైనా కంపెనీలు కర్ణాటకలో ఉన్నాయా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్గేట్ 2024 ఆగస్టు 10న కొట్టుకుపోయింది. ఈ గేటుకు స్టాప్లాగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు క్రస్ట్గేట్ నిర్మాణం కోసం గుజరాత్కు చెందిన హార్డ్వేర్ టూల్స్, మెషినరీ ప్రాజెక్ట్ కంపెనీకి టెండర్ అప్పగించారు. ఈ కంపెనీ మెటీరియల్ను కొనుగోలు చేసి, గేట్ తయారీ పనిలో బిజీగా ఉంది. జూన్ నెలాఖరు నాటికి ఈ కంపెనీ గేట్ను ఏర్పాటు చేయాలని టెండర్లో పేర్కొన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.
కర్ణాటక, ఆంధ్రల నుంచి ఒక్క కంపెనీ కూడా దరఖాస్తు చేసుకోని వైనం