
ఇకపై హెల్మెట్ ధారణ తప్పనిసరి
సాక్షి,బళ్లారి: ద్విచక్ర వాహనల్లో వెళ్లేవారు హెల్మెట్ ధరించక పోవడంతో పెద్ద సంఖ్యలో ప్రమాదాలకు గురి అవుతుండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనాల్లో వెళ్లే వారు ప్రమాదాల బారిన పడ్డారు. దీంతో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో పాటు మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు మేలు చేస్తుందనే ఉద్దేశ్యంతో జిల్లా ఎస్పీ శోభారాణి దిశానిర్దేశంతో గురువారం నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో డీఎస్పీ నందారెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు అయ్యనగౌడ పాటిల్, రవిచంద్ర, సుభాష్ తదితరులు ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారికి హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు.
ప్రాణాలు ఎంతో విలువైనవి
ఈ సందర్భంగా ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యనగౌడ పాటిల్ మాట్లాడుతూ ప్రాణాలు ఎంతో విలువైనవని, వెలకట్టలేనివన్నారు. క్షణాల్లో ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయట పడేందుకు హెల్మెట్ రక్షణ కవచంగా ఉంటుందని సూచించారు. పోలీసులకు భయపడి హెల్మెట్ ధరించకూడదని, మీ ప్రాణాలను కాపాడుకునేందుకు మీరే హెల్మెట్ ధరించాలన్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపితే మీకే ప్రమాదమని సూచించారు. ఒకవేళ హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే జరిమానా తప్పనిసరిగా విధిస్తారన్నారు. హెల్మెట్ వేసుకోవడం వల్ల ఎంతో మేలు చేస్తుందన్నారు.
ప్రాణరక్షణా కవచం హెల్మెట్
హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో కింద పడినప్పుడు తప్పకుండా రక్షిస్తుందని గుర్తు చేశారు. ఈసారి తూతూ మంత్రంగా చేపడుతున్న జాగృతి సమావేశం కాదన్నారు. నిబంధనలను కట్టుదిట్టం చేశారన్నారు. నగరంలో అన్ని రహదారుల్లో ఉన్న సీసీ కెమెరాల్లో కూడా ఎవరు హెల్మెట్ ధరించారు, ఎవరు హెల్మెట్ ధరించలేదు అన్నది కూడా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పోలీసులు కూడా ఆయా కూడళ్లలో హెల్మెట్పై అవగాహన కల్పిస్తున్నారన్నారు. తక్షణం ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపారు.

ఇకపై హెల్మెట్ ధారణ తప్పనిసరి