
సమస్యలపై స్పందించకుంటే చర్యలు
శివాజీనగర: మేము, మీరంతా ప్రజల పన్నుల సొమ్ముతో పరిపాలన చేస్తున్నాం. అన్ని సదుపాయాలను అనుభవిస్తున్నది ప్రజల పన్నుల సొమ్ము ద్వారానే అనేది మరువరాదు. అందువల్ల ప్రజల సమస్యలపై స్పందించకపోతే అటువంటి అధికారుల విరుద్ధంగా నిర్ధాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం సిద్దరామయ్య అన్ని జిల్లాధికారులు, జిల్లా పంచాయితీల సీఇఓలకు కట్టుదిట్టమైన హెచ్చరికలు చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల జిల్లాధికారులు, సీఇఓలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు.
చట్టాన్ని నాశనం చేస్తే చర్యలు తీసుకోండి:
రాజ్యాంగ, ప్రజా వ్యతిరేక దుష్ట శక్తులు ఎంతటి ప్రభావం కలిగినా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మీకు వ్యతిరేకంగా తాము చర్యలు తీసుకుంటామని సీఎం జిల్లా అధికారులను హెచ్చరించారు. శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా మారితే అభివృద్ధి సాధ్యపడదన్నారు.
డీసీ, సీఇఓల పర్యటన కార్యక్రమం ప్రకటించాలి:
జిల్లాధికారులు, సీఇఓలు తమ పర్యటన కార్యక్రమం వివరాలు ముందుగానే ప్రజలకు తెలిసేలా ప్రకటించాలి. తనిఖీల నివేదిక ఆధారాలను సక్రమంగా ఉంచుకోవాలి. పాఠశాలలు, హాస్టళ్లను ముందుగా సూచన లేకుండా తనిఖీ చేయాలని గతంలో ఆదేశించినా చాలా మంది పాటించలేదనే నివేదిక తనకు వచ్చిందని సీఎం అన్నారు. జిల్లాలో సామాన్య ప్రజలకు ఆరోగ్య, రవాణా సంచారం లాంటి మౌలిక సదుపాయాలు లభించకపోతే దానిని పరిపాలన వైఫల్యమనే పరిగణించాల్సి ఉంటుందన్నారు. అడవుల్లో పాఠశాల, రోడ్డు, ఆసుపత్రిలాంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎందుకు సాధ్యపడలేదని ప్రశ్నించారు. సీఇఓలు ఇటువంటి అడవులకు నిరంతరం భేటీ చేయాలని సూచించారు.
జిల్లాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
కొందరు జిల్లాధికారులు, సీఇఓలు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు వచ్చాయి. అణగారిన వర్గాలు, పేదలు, సామాన్య ప్రజలు సాధారణంగా జిల్లాధికారుల కార్యాలయానికి వస్తారు. అటువంటి వారి కష్టాలను మీరే ఆలకించకపోతే దానిని పరిష్కరించేవారు ఎవరు?, ఎవరి వద్ద వారు తమ కష్టాలను చెప్పుకోవాలి? అని సీఎం ప్రశ్నించారు. తాలూకా, జిల్లా కేంద్రాల్లో అధికారులు కేంద్ర స్థానంలో ఉండాలన్నారు. జిల్లా ఇన్చార్జి కార్యదర్శులు నెలలో కనీసం రెండు సార్లు ఆయా జిల్లాలకు భేటీ చేసి అభివృద్ధి పనులను పరిశీలించాలన్నారు.
జిల్లాధికారులు తప్పు చేసినా నిర్ధాక్షిణ్యంగా చర్యలు:
జిల్లాధికారి, జిల్లా భద్రతాధికారులు, సీఈఓలు తమ అహంభావం పక్కకుపెట్టి సమన్వయంతో పని చేస్తేనే రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీఎం సిద్దరామయ్య అన్నారు. రాజ్యాంగ ఆశయాలకు విరుద్ధంగా పనులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
అధికారులను హెచ్చరించిన సీఎం సిద్దూ
బాల్య వివాహాలను అడ్డుకోలేరా?
బాల్య వివాహాల గురించి సీఎం మాట్లాడుతూ బాల్య వివాహాలను ఎందుకు అరికట్టడం లేదని ప్రశ్నించారు. మీ కింది స్థాయివారు మీకు రిపోర్ట్ ఇవ్వటం లేదా? మీకు వారిపై నియంత్రణ లేదా? అని ప్రశ్నించారు. ఈ సంవత్సరం 700 బాల్య వివాహాలు జరిగాయని, బాల్యంలోనే తల్లులైన ఘటనలు కూడా వార్తల్లో వచ్చాయన్నారు. ఈ మేరకు కొన్ని చోట్ల ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదనేది తమ దృష్టికి వచ్చిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి సంవత్సరాలు గడిచినా బాల్య వివాహాలు జరుగుతున్నాయంటే ఎలా?, బాల్య వివాహాలు అరికట్టేందుకు ఉన్న చట్టాలు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు.