
మారెమ్మదేవికి పూజలు
బొమ్మనహళ్లి : బొమ్మనహళ్లి నియోజకవర్గం హెచ్ఎస్ఆర్లేఔట్ వార్డు పరంగిపాళ్య గ్రామంలో వెలసిన గ్రామదేవత మారెమ్మదేవికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వినయ్ కుమార్ దీక్షిత్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి వివిధ రకాల పూలతో అలంకరించి పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
విజయపురలో
దేశ ద్రోహిపై కేసు
హుబ్లీ: ఆపరేషన్ సిందూర ద్వారా పాకిస్తాన్లో ఉగ్రవాదులకు భారతీయ సేన తగిన గుణపాఠం చెబుతుండగా విజయపురలో తషావుద్ ఫారుఖీ షేక్ అనే ఓ వైద్య విద్యార్థిని పాకిస్తాన్కు అనుకూలంగా పోస్టు చేసి స్థానికుల కన్నెర్రకు గురయ్యారు. ఈమె పోస్టుపై దేశద్రోహం చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. కాగా పాక్ మూలాలకు చెందిన హుబ్లీలో నివసిస్తున్న ఓ మహిళ గురించి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చానని పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. ప్రభుత్వం తీర్మానం మేరకు చర్యలను తీసుకుంటామన్నారు. 2016లో పాకిస్తాన్ నుంచి కచ్ ద్వారా వచ్చిన సదరు మహిళ హుబ్లీలో ఓ క్రైస్తవ వ్యక్తిని వివాహం చేసుకున్నారన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సుదీర్ఘకాలం వీసాపై హుబ్లీలో ఉంటున్న ఈమె గురించి అన్ని వివరాలను ప్రభుత్వానికి, తమ సీనియర్ అధికారులకు తెలియజేశానన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే సూచన మేరకు ఆమైపె తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
హెచ్ఏఎల్లో హైఅలర్ట్
శివాజీనగర: భారత్–పాక్ యమధ్య ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో బెంగళూరులోని హెచ్ఏఎల్లో హై అలర్ట్ ప్రకటించింది. సిబ్బంది సెలవులను రద్దు చేశారు. ఓవర్ టైం పనికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరులో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. హెచ్ఏఎల్ భారతీయ ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఏరోస్పేస్, రక్షణా పరికరాల తయారీ సంస్థ.
విమానాశ్రయానికి గట్టి భద్రత
దొడ్డబళ్లాపురం: భారత్–పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నడంతో కెంపేగౌడ ఎయిర్పోర్టుకు టైట్ సెక్యూరిటీ కల్పించారు. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి పాక్ సరిహద్దు వరకూ వెళ్లే విమానాలను రద్దు చేశారు. ముఖ్యంగా విమాన ప్రయాణీకులు మూడు గంటల ముందే ఎయిర్పోర్టుకు చేరుకోవాలని విమానాశ్రయ అథారిటీ ట్వీట్ చేసింది. దేశంలో హైఅలర్ట్ ప్రకటించడంతో ఎక్కువ భద్రత కల్పించి తనిఖీలు క్షుణ్ణంగా చేస్తున్నామని తెలిపింది. ప్రయాణీకులు తాము ప్రయాణించే విమానాల రాకపోకలపై ఎప్పటికప్పుడు విమానయాన సంస్థలతో మాట్లాడి తెలుసుకోవాలని సూచించారు.
మోసగాళ్లను వదిలేసిన పోలీసులు ●
● ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ అరెస్ట్
దొడ్డబళ్లాపురం: మోసాలకు పాల్పడే నిందితులను పట్టుకుని అరెస్టు చేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆ నిందితులను బెదిరించి దోపిడీకి పాల్పడ్డ సంఘటన బాగలూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిక్కజాల పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ను బాగలూరు పోలీసులు అరెస్టు చేశారు. బాగలూరు పీఎస్ పరిధిలోని ఒక ప్రతిష్టిత హోటల్లో ముగ్గురు మోసగాళ్లు ఉన్నారని స్టేషన్కు సమాచారం వచ్చింది.దీంతో ముగ్గురు పోలీసులూ అక్కడకు వెళ్లి నిందితులను బెదిరించి వారి వద్ద ఉన్న రూ.6లక్షలు తీసుకుని వారిని వదిలేశారు. మరుసటి రోజు బాగలూరు పోలీస్స్టేషన్ పరిధిలో రూ.44 లక్షలు కలిగిన బ్యాగ్ చోరీకి గురైంది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ముగ్గురు పోలీసుల నిర్వాకం వెలుగు చూసింది. దీంతో ముగ్గురు పోలీసులను అరెస్టు చేశారు.