
లారీ బోల్తా పడి దగ్ధం
హొసపేటె: కూడ్లిగి తాలూకా శివపుర గ్రామ సమీపంలోని జాతీయ రహదారి– 50పై వేరుశనగ లోడుతో నిండిన లారీ అకస్మాత్తుగా బోల్తా పడి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. బాగల్కోటె నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న వేరుశెనగ విత్తనాలతో కూడిన లోడు లారీ బోల్తా మంటల్లో చిక్కుకుంది. దాని సరుకు కూడా మంటల్లో కాలిపోయింది. లారీ డ్రైవర్ మాత్రం సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. కూడ్లిగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రకాష్ ఆ ప్రాంతంలో వన్వే ట్రాఫిక్ సులభతరానికి చర్యలు తీసుకున్నారు.
బాలికపై అత్యాచారయత్నం
● నిందితుని అరెస్టు
హుబ్లీ: మైనర్ బాలికపై ఓ నీచుడు అత్యాచారానికి ప్రయత్నించి జైలు పాలైన ఘటన బెళగావి జిల్లా అథణి తాలూకాలోని ఐగళి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన కామాంధుడు మహంతేష్ హిప్పరిగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ కృత్యానికి పాల్పడ్డాడు. తక్షణమే బాలిక తల్లిదండ్రులకు ఘటన గురించి తెలిపింది. దీంతో వారు ఐగళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసుకున్న ఐగళి పోలీసులు అతనిని కోర్టులో హాజరు పరిచి జుడీషియల్ కస్టడీకి అప్పగించారు.
పంటనష్టం పరిశీలన
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ చిదానందతో సహా అధికారులు ఇటీవల ఈదురు గాలులు, వర్షాల కారణంగా దెబ్బ తిన్న పంటలను సోమవారం పరిశీలించి నష్టం అంచనా వేశారు. తాలూకాలోని అయ్యనహళ్లిలో వీరభద్రప్ప అనే రైతుకు చెందిన పంట ఈదురు గాలులకు, వర్షం కారణంగా పూర్తిగా నాశనమైంది. తన 11 ఎకరాల బొప్పాయి పంటకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిహారం అందించడానికి చర్యలు తీసుకుంటామని రైతులకు అధికారులు హామీ ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో పంటలు దెబ్బతినక పోయినా, ఎతైన ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు వ్యవసాయ శాఖ నుంచి లభించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంబీ.అయ్యనహళ్లికి చెందిన మరో రైతు యజమానప్ప తన భూమిలో పండిస్తున్న వర్షానికి ధ్వంసమైన డాగన్ ఫ్రూట్ పంటను వీక్షించారు. ఉద్యానవన అధికారులు మహ్మద్ సయ్యద్, గుడేకోటె విశ్వనాథ్, రైతులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం
రాయచూరు రూరల్: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళకు ప్రసవమైన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి కారవార నుంచి యాదగిరికి ఆర్టీసీ బస్సులో వస్తుండగా మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. బతుకు తెరువు కోసం వలస వెళ్లిన యాదగిరి జిల్లా సురపుర తాలూకా హోంబళకల్కు చెందిన శాంభవికి రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా ముదుగల్ వద్ద బస్సులోనే ప్రసవం అయింది. అదే బస్సులో ఆశా కార్యకర్త ప్రయాణిస్తుడడంతో ప్రసవ సుగమమైంది. అనంతరం తల్లీబిడ్డను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.
నరేగ పనులపై పర్యవేక్షణ
రాయచూరు రూరల్: జిల్లాలో నిర్వహిస్తున్న నరేగ పనుల పర్యవేక్షణకు కేంద్ర బృందం పలు ప్రాంతాల్లో పర్యటించింది. సోమవారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రగతిపై పరిశీలించింది. జెడ్పీ ప్రణాళికాధికారి శరణ బసవ ఆధ్వర్యంలో కేంద్ర బృందానికి పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించి కూలీలతో చర్చించారు. కర్ణాటకతో పాటు తెలంగాణ, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పర్యటించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ బాలమురళి తెలిపారు. ఆయన వెంట అధికారులు శివశంకర్, అవనేంద్ర కుమార్ పర్యటించారు.

లారీ బోల్తా పడి దగ్ధం

లారీ బోల్తా పడి దగ్ధం

లారీ బోల్తా పడి దగ్ధం

లారీ బోల్తా పడి దగ్ధం