
కౌల్బజార్లో ముస్లిం గురువుల జాతా
రాయచూరు రూరల్: నగరంలో ముస్లిం సహోదరులు ఈద్ మిలాద్ నబీ ప్రార్థనలు జరిపి ప్రశాంతంగా సామూహిక ర్యాలీ నిర్వహించారు. బుధవారం తీన్ కందీల్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తిశ్రద్ధలతో ఈద్ మిలాద్ పండుగను జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సయ్యద్ యాసిన్ మాట్లాడుతూ జిల్లాలో హిందూ, ముస్లింలు అన్నదమ్ములుగా మెలుగుతున్నామన్నారు. మనమంతా ఒక్కటే అనే భావాలను చాటడానికి వినాయక నిమజ్జనం, ఈద్ మిలాద్ పండుగలు చేసుకోవడం హర్షణీయమన్నారు. తీన్ కందీల్ నుంచి ఏక్మినార్, జాకీర్ హుసేన్ చౌక్, నగరసభ మీదుగా టిప్పుసుల్తాన్ రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా మాన్విలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే హంపయ్య నాయక్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
భక్తిశ్రద్ధలతో ఈద్ మిలాద్
కంప్లి: ఈద్ మిలాద్ పండగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరిపారు. హజ్రత్ మహ్మద్ పైగంబర్ జన్మదినం సందర్భంగా జరిపే మిలాద్ నబీ ముస్లింలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండగ. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రికే మసీదులన్నింటిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం జోగి కాలువ వద్ద గల దర్గా నుంచి మక్కా మసీదు చిత్రనమూనాలతో ముస్లిం సోదరులందరూ నారాయతక్బీర్–అల్లాహు అక్బర్ అని జపిస్తు ఊరేగింపు జరిపారు. అంబేడ్కర్ సర్కిల్ చేరుకొని తిరిగి దర్గాకు చేరుకొని ధార్మిక కార్యక్రమాలు జరిపారు. ఇక గురువారం సాయంత్రం ముద్దాపుర అగసి ప్రాంతాన గల మసీదు వద్ద మహ్మద్ పైగంబర్ గడ్డం వెంట్రుక(ఆసాల్)ను భూతద్దం ద్వారా ప్రజలకు దర్శించుకునే భాగ్యం కల్పించారు. ఈ దర్శనార్థం విచ్చేసిన ముస్లిం సోదరులకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ముస్లిం సోదరులకు అన్న సంతర్పణ జరిపారు.
ప్రత్యేక సామూహిక ప్రార్థనలు
హొసపేటె: ముస్లిం సమాజ ప్రవక్త మహమ్మద్ ఫైగంబర్ జీవిత సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దేవుడి సృష్టిని ప్రబోధించారని ముస్లిం సమాజ నేత హెచ్ఎన్ ఇమామ్ నియాజీ తెలిపారు. గురువారం ఈద్ మిలాద్ సందర్భంగా స్థానిక ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గవియప్ప, ముస్లిం సమాజ నేతలు, వందలాది మంది సమాజ సోదరులు పాల్గొన్నారు.
గంగావతిలో..
గంగావతి: ఈద్ మిలాద్ నబీ పర్వదినాన్ని నగరంలో ముస్లిం సోదరులు ఘనంగా జరిపారు. ఉదయాన్నే నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి వేర్వేరుగా ఊరేగింపులను నిర్వహించారు. ఈ ఊరేగింపులో ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ హెచ్ఆర్ శ్రీనాథ్ పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలను తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహమ్మద్ పైగంబర్ జన్మదినాన్ని ఆచరించడం ద్వారా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థించానన్నారు. ఈ సందర్భంగా హజ్రత్ బిలాల్ మసీదులో ముస్లిం సమాజ గురువు అఫ్రోజ్ మహమ్మద్ ఇమ్రాన్, యువకులు రక్తదానం చేశారు.
ఘనంగా ఈద్ మిలాద్
బళ్లారిఅర్బన్: ఈద్మిలాద్ సందర్భంగా గురువారం సిటీ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. బెంగళూరు రోడ్డు జామియా మసీదులో ముస్లిం బాంధవుల సమక్షంలో ప్రార్థనలు నిర్వహించారు. అంతకు ముందు కౌల్బజార్లో ఈద్ మిలాద్ జాతాను ముస్లిం బాంధవులు ఐకమత్యంగా జరుపుకున్నారు. ముస్లిం మత గురువు సర్ఖాజి భంభం సాహెబ్, కార్పొరేటర్ నూర్ మహమ్మద్ పాల్గొన్నారు.
వైభవంగా ఈద్ మిలాద్ ఊరేగింపు
కోలారు: ఈద్ మిలాద్ పండుగ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు బృహత్ ఊరేగింపును నిర్వహించారు. నగరంలోని క్లాక్ టవర్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు బస్టాండు సర్కిల్, ఎంబీ రోడ్డు మీదుగా మెక్కె సర్కిల్కు చేరుకుంది. నగరంలో ప్రధాన వీధులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు ఊరేగింపులో పాల్గొన్నారు.
ఈద్ మిలాద్కు భారీ కత్తి ఏర్పాటు
కోలారు: ఈద్ మిలాద్ సందర్భంగా నగరంలోని టవర్క్లాక్ వద్ద ఏర్పాటు చేసిన భారీ ఖడ్గా(కత్తి)న్ని పోలీసులు వివాదం కాకూడదని భావించి ముందు జాగ్రత్తగా జేసీబీ క్రేన్ సహాయంతో కిందకు దించి తీయించారు. అనంతరం సముదాయ ప్రముఖులతో చర్చించి వివాదం కాకుండా చూశారు. పోలీసుల ముందు జాగ్రత్తపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు. ఖడ్గంపై ఖురాన్ సందేశాన్ని వేసి రూపొందించిన స్వాగత కమాను సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు మేల్కొని జేసీబీ సహాయంతో ఖడ్గాన్ని తొలగించారు. ఈ సందర్భంగా దాదాపు గంట పాటు క్లాక్టవర్ వద్ద ట్రాఫిక్ను బంద్ చేశారు.

కోలారులో ఈద్ మిలాద్ సామూహిక ఊరేగింపు చేపట్టిన దృశ్యం

కంప్లిలో మక్కా మసీదు నమూనా చిత్రాన్ని ఊరేగిస్తున్న ముస్లిం సోదరులు

హొసపేటెలో ఎమ్మెల్యే గవియప్పను సన్మానిస్తున్న ముస్లిం సోదరులు

మాన్విలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే హంపయ్యనాయక్ తదితరులు

వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భరత్రెడ్డి