తిమ్మాపూర్: మండలంలోని దిగువమానేరు జలాశయం పరిశీలనకు కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలం బుధవారం అకస్మాతుగా వచ్చారు. దాదాపు రెండు గంటల పాటు డ్యామ్ను వివిధ భాగాల్లో కలయతిరిగారు. డ్యామ్ కట్టపై నుంచి నీటి ప్రవాహం ఉన్నంతవరకు నడుచుకుంటూ లోపలికి వెళ్లిన సీపీ, నీటి విడుదల, నీటి నిలువను సమీక్షించారు. రాబోయే రోజుల్లో ఏవైనా ప్రమాదాలు ఉంటాయా, నీటి కొరత ఎలా ఉంటుందనే అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
మట్టి తరలింపు పరిశీలన..
మానేరు రివర్ ఫ్రంట్ పనుల కోసం తరలిస్తున్న మట్టి లారీల వివరాలు సీపీ తెలుసుకున్నారు. ఈ వాహనాలకు అవసరమైన అనుమతులు ఉన్నాయా, నిబంధనలు పాటిస్తున్నారని వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డ్యామ్లో తిరగడం స్థానికులు, అధికారులలో ఆశ్చర్యం కలిగించింది. మట్టి మాఫియా ఏమైనా ఉందా అని కూడా ఆరా తీసినట్లు సమాచారం. అదేవిధంగా సాయంత్రం వేళలో డ్యామ్ కట్టపై పెట్రోలింగ్ మరింత పెంచాలని డ్యామ్ పరిసరాలకు విద్యార్థులు పిల్లలు రాకుండా చర్యలు తీసుకోవాలని తిమ్మాపూర్ సీఐ రమేశ్, ఎస్ఐ అన్వర్లకు సూచించారు.


