కొత్తపల్లి(కరీంనగర్): సాంప్రదాయ చేతివృత్తులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. చింతకుంటలో విశ్వకర్మ యోజన పథకం కింద 15 రోజులపాటు శిక్షణ పొందిన వారికి శుక్రవారం 56 కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విశ్వకర్మ యోజన పథకం ద్వారా కొత్తపల్లిలోనే దాదాపు 260 మంది లబ్ధిపొందడం హర్షదాయకమన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేపట్టే అంజన్న ఆశీర్వాద యాత్రను విజయవంతం చేయాలని కోరారు. గుంజేటి శివ, వేముల అనిల్కుమార్, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
కమీషన్ల కోసమే జాప్యమా?
కరీంనగర్: నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో అభివృద్ధి పనులకు టెండర్లు నిర్వహించి మూడు నెలలు గడుస్తున్నా, వాటిని అధికారులు ఓపెన్ చేయకపోవడంలో ఆంతర్యమేంటని మాజీ మేయర్, కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. నగరంలో శుక్రవారం మాట్లాడుతూ గతేడాది 87 అభివృద్ధి పనులకు రూ.50 కోట్ల నిధులు కేటాయించి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. ఈ ఏడాది జనవరిలో పనులకు టెండర్లు నిర్వహించిన అధికారులు, మూడు నెలలు గడుస్తున్నా ఓపెన్ చేయడం లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కమీషన్ల కోసం టెండర్లు ఓపెన్ చేయడం లేదా అని ప్రశ్నించారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అధికా రులు అభివృద్ధి పనులపై శ్రద్ధ చూపాలన్నారు.
కో ఆప్షన్పై కదలిక
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలపై కదలిక మొదలైంది. పాలకవర్గం మొదటి సమావేశం అనంతరం 60 రోజుల్లో తప్పనిసరిగా కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలనే మున్సిపల్ చట్టం ప్రకారం ఎన్నిక వైపు అడుగులు పడుతున్నాయి. నగరపాలకసంస్థకు సంబంధించి మొత్తం ఐదు కో ఆప్షన్ పదవులు ఉన్నాయి. ఇందులో ఇద్దరు మైనార్టీలు ఉంటారు. జనరల్ కేటగిరీలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్పై అవగాహన ఉన్న రిటైర్డ్ అధికారులు అర్హులుగా ఉంటారు. ఇక మైనార్టీ కోటాలో ముస్లిం, క్రిస్టియన్లు, సిక్లు, బుద్దిస్ట్, పార్శీలకు అవకాశం ఉంటుంది. ఎన్నికల ఫలితాల అనంతరం మొదటి సమావేశం గత నెల 16వ తేదీన జరి గింది. ఆ సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహించారు. మొదటి సమావేశం 16వ తేదీన జరిగినందున 60 రోజుల్లో అంటే ఏప్రిల్ 16వ తేదీలోగా విధిగా ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఇదిలాఉంటే నగరపాలకసంస్థ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రాని వాళ్లు, ఎన్నికల్లో ఓడిపోయిన మాజీలు కో ఆప్షన్ సభ్యుల కోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
జమ్మికుంట: స్థానిక మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,500 పలికింది. శుక్రవారం మార్కెట్కు 15 వాహనాల్లో 121 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మో డల్ ధర రూ.7,200, కనిష్ట ధర రూ.6,950కు వ్యాపారులు కొనుగోలు చేశారు. శని,ఆదివారాలు మార్కెట్కు సాధారణ సెలవులుంటా యని, సోమవారం కొనుగోళ్లు జరుగుతాయని ఇన్చార్జి కార్యదర్శి రాజా తెలిపారు.
కొత్తపల్లి: 33/11 కె.వీ.విద్యుత్ సబ్స్టేషన్లలో విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున శనివారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తపల్లి, రేకుర్తి, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ సబ్స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు, గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్రూరల్ ఏడీఈ గాదం రఘు ఒక ప్రకటనలో తెలిపారు.


