సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని చివరి రోజుల్లో గృహనిర్బంధంలో ఉంచారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సంచలన ఆరోపణలు చేశారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే దీనిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.
శనివారం తిరువణ్ణామలైలో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘కరుణానిధి గురించి డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి ఎ.రాజా చెప్పిన విషయాలనే గుర్తు చేస్తున్నా. తండ్రిని గృహనిర్బంధంలో ఉంచడం న్యాయమేనా అని సీఎం స్టాలిన్ను ఉద్దేశించి ఒక వీడియోలో రాజా ప్రశ్నించారు’’ అని చెప్పారు. మాజీ సీఎం జయలలిత మృతిపై విచారణ జరిపిస్తామన్న స్టాలిన్, తన తండ్రి కరుణానిధిని గృహనిర్బంధంలో ఉంచిన వారిపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు.
అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే దీనిపై విచారణ చేయించి, బాధ్యులను శిక్షిస్తామని పళనిస్వామి ప్రకటించారు. 2021–26 మధ్య కాలంలో తమిళనాడును అప్పుల్లో, అవినీతిలో, డ్రగ్స్ వాడకంలో, శాంతిభద్రతల వైఫల్యంలో స్టాలిన్ నంబర్వన్ స్థానానికి తీసుకెళ్లారని విమర్శించారు. ఆయన కేవలం ఫొటోషూట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.


