సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్కు అబద్దాలు చెప్పడంలో ఆస్కార్ ఇవ్వొచ్చని అన్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలపై చర్యలు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘సెంట్రల్ యూనివర్సిటీలో అరాచకం చేశారు. అలా ఇక్కడ చేయవద్దు. నెమళ్లు, పక్షులు, ఉన్నాయి పర్యావరణాన్ని రక్షించాలి. డంప్ యార్టుకు బీజేపీ వ్యతిరేకం కాదు.. ప్రజలకు దూరంగా ఉన్న దగ్గర నిర్మించాలి. హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ గురించి సీఎంకు తెలిసే మాట్లాడాడు. ఓసారి డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని సీఎం పరిశీలించాలి లేదా నివేదిక తెప్పించుకోవాలి. లాఠీ దెబ్బలు అయినా తింటాం కానీ హుజురాబాద్లో డంప్ యార్డును అడ్డుకుంటాం.
బీహార్, మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కారణం. కేరళంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఆరు గ్యారంటీలు తెలంగాణలో అమలు కావడం లేదు. నిరుద్యోగ భృతి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడం లేదు. హామీలు అమలవుతున్నాయని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా లేదంటే సీఎం రాజీనామా చేయాలి. ఢిల్లీకి పోయి డబ్బు మూటలు స్పెషల్ ఫ్లైట్లలో ఇచ్చారు. కేరళ మీడియా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు గురించి తెలుసుకోవాలి. ఆరు గ్యారంటీలపై చర్చకు సవాలు చేస్తున్నా.. నా సవాలుకు సీఎం సిద్ధమా?’ అని ప్రశ్నించారు.


