కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ శనివారం ఉదయం కరీంనగర్లో ప్రారంభం కానుంది. మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు అంజన్న సన్నిధి వరకు కొనసాగుతుంది. అంజన్నకు మొక్కులు చెల్లించేందుకు బండి సంజయ్ 40కిలోమీటర్ల దూరాన్ని 8గంటల్లో నడిచి పూర్తి చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ యాత్రలో బీజేపీకి చెందిన 108 మంది సర్పంచులు, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు, హనుమాన్ భక్తులు పాల్గొననున్నారు. బండి సంజయ్ శనివారం ఉదయం 6గంటలకు మహాశక్తి అమ్మవారిని దర్శించుకుని 7గంటలకు యాత్రను ప్రారంభిస్తున్నారు. నేడు పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్నందున పాదయాత్ర సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా క్రమశిక్షణ పాటించాలని పార్టీ శ్రేణులను సంజయ్ కోరారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు పోలీసులు సహకరించాలని సూచించారు.


