సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని సినారే గ్రంథాలయంలో ఈనెల 18న ఉగాది పర్వదినం సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు మానేరు రచయితల సంఘం ప్రతినిధులు డాక్టర్ కందేపి రాణీప్రసాద్, గెంట్యాల భూమేశ్, ఆడెపు లక్మణ్ తెలిపారు. ఆసక్తి గల కవి, రచయితల నుంచి ఉగాది కవితలను ఆహ్వానిస్తున్నామని, ఔత్సాహికులు ఎవరైనా కవితా గానం చేయొచ్చన్నారు. గానం చేసే కవితలు ముందుగానే తెలియజేయాలని కోరారు. పండుగ నేపథ్యం, ప్రాశస్త్యం, జన జీవనంపై ఋతువులో మార్పుల ప్రభావం, రాబోయే కాలంలో సాంఘిక జీవనం ఎలా ఉండాలని ఆశిస్తూ.. పండుగ, ప్రజల్లో కొత్త మార్పులకు చోటు కల్పించాలనే ఆకాంక్షతో ఉండాలని, మూస ధోరణికి భిన్నంగా ఉన్న కవితలను మాత్రమే గానం చేయాలన్నారు. కవులు తమ కవితలను ఈనెల 15 లోపు 98491 57752 నంబర్కు వాట్సప్లో పంపించాలని కోరారు. గతంలో గానం చేసినవి, పత్రికల్లో అచ్చయినవి కాకుండా నూతనంగా, నవ్యత్వం ఉట్టి పడేలా కవితల రచనలుండాలని కోరారు. కవి సమ్మేళనంలో పాల్గొన్నవారికి సంఘం తరఫున సత్కారం ఉంటుందన్నారు. గడువు తర్వాత అందిన కవితలు పరిశీలించబడవని నిర్వాహకులు స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారానికే విద్యుత్ సదస్సులు
పెగడపల్లి: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకే సదస్సులు నిర్వహిస్తున్నామని సీజీఆర్ఎఫ్–2 నిజామాబాద్ జిల్లా చైర్మన్ నారాయణ అన్నారు. మండలకేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో గొల్లపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పెగడపల్లి, బతికపల్లి, గొల్లపల్లి, చిల్వకోడూర్ సెక్షన్ల పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. లూజ్లైన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్లోడ్, అధిక బిల్లులు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్శాఖ పని చేస్తుందన్నారు. సిబ్బందికి బిల్లుల డబ్బులు ఇవ్వొద్దని, ఆన్లైన్లో చెల్లించాలని సూచించారు. వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు రామకృష్ణ, సత్యనారాయణ, రాజాగౌడ్, గంగరాం, ఏఈ మధు, అజయ్కుమార్, సిబ్బంది రవీందర్రెడ్డి, బాల్నాయక్, లైన్మెన్లు పాల్గొన్నారు.


