చందుర్తి (వేములవాడ): కుక్కను తప్పించబోయిన పక్కనే కల్వర్టును ఢీకొట్టిన కారు కల్వర్టు కింద పడి పోయింది. కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు బతికి బయటపడ్డారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి శివారులో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన నలుగురు యువకులు మంగళవారం వేకువజామున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి బయలుదేరారు. మార్గమధ్యలో చందుర్తి మండలం మూడపల్లి శివారులోని మూలమలుపు వద్ద కుక్క ఎదురుగా అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని దాని కిందపడిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్న అగ్గం రాజేశ్, కొలిపాక సురేశ్, సాతుబండ కల్యాణ్, గట్టు గోపాల్ ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, కల్వర్టు కింద పడిన కారును జేసీబీతో పైకి తీశారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చందుర్తి పోలీసులు తెలిపారు.
కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో దక్కిన ప్రాణాలు


