సైదాపూర్: వేసవిలో తాగునీటి సమస్య రాకుండా పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూస్ అధికారులు కృషి చేయాలని, తాగునీటి కోసం ప్రజలు ఇ బ్బందులు పడితే చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. సోమవారం మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సమావేశంలో మాట్లాడారు. 99 రోజుల్లో గ్రామాల స్వరూపాలను అభివృద్ధితో మార్చాలని ఆదేశించారు. ప్రైవేట్ స్కూళ్ల బస్సులు గ్రామాలకు రాకుండా సర్పంచులు, ఉపసర్పంచ్లు అడ్డుకొని ప్రభుత్వ బడులు తెరిపిస్తే ఆ గ్రామాలకు అధిక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. రాయికల్ వాటర్ఫాల్స్, సర్వాయిపాపన్న గుట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీపీవో జగదీశ్వర్, హౌజింగ్ పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


