కరీంనగర్అర్బన్: మరాడించి బియ్యమివ్వాలని ప్రభుత్వం ధాన్యమిచ్చి వాటిని సకాలంలో తీసుకోకుండా వేధింపులకు గురి చేయడం తగదని రైస్మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి నర్సింగరావు అన్నారు. ఇచ్చినప్పుడుడు తీసుకోకుండా బకాయిలు ఇవ్వకుండా మిల్లర్లను మానసికంగా వేధిస్తున్నారని విమర్శించారు. మిల్లు ఇబ్బందులు తట్టుకోలేక జిల్లాలో తణుకు స్వప్న ఆత్మహత్య చేసుకుందని, మిల్లర్లకు ప్రభుత్వం భరోసానివ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం రైస్మిల్లర్ల సంఘ భవనంలో మాట్లాడారు. డిఫాల్ట్ మిల్లర్లకు విధించిన 25శాతం పెనాల్టీ, 12శాతం వడ్డీని మాఫీ చేసి 4 వారాల్లో బియ్యం పెట్టి సివిల్ సప్లయ్ బాకీ తీర్చేందుకు అవకాశమివ్వాలని కోరారు. అధిక విద్యుత్తు చార్జీలు, ధాన్యం ఇచ్చినంత త్వరగా బియ్యం తీసుకోకపోవడం, తదితర కారణాలతో ఇండస్ట్రీ నష్టాల బాటలో ఉందన్నారు. సదరు కారణాలతో అవగాహన లేని మిల్లర్లు డిఫాల్ట్ మిల్లర్లుగా మిగిలిపోతున్నారని తెలిపారు. మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్, డ్రై ఏజ్, కస్టోడియన్ చార్జీలు కొన్నేళ్లుగా నిలిచిపోయాయని, వెంటనే ఇప్పించాలన్నారు. మిల్లర్ల డిమాండ్లను పరిశీలించి న్యాయం చేయాలని, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఇండస్ట్రీని కాపాడాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తొడుపునూరి కరుణాకర్, జి.రాజమౌళి, కోశాధికారి జి.ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.


