కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఈ నెల 14న ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరిట మహాపాదయాత్ర చేపట్టనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీ గెలుచుకుంటే కొండగట్టు అంజన్న ఆలయానికి పాదయాత్ర చేస్తానని బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మహాపాదయాత్రకు ‘అంజన్న ఆశీర్వాదయాత్ర’గా నామకరణం చేశారు. 14న ఉదయం 7 గంటలకు కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతోంది. రేకుర్తి, కొత్తపల్లి, గంగాధర, కొడిమ్యాల, మల్యాల మీదుగా సుమారు 40 కిలోమీటర్ల మేర కాలినడకన అంజన్న ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకుంటారు.
నూతన ప్రజా ప్రతినిధులతో..
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు దాదాపు 10వేల మంది కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. పాదయాత్ర విజయవంతానికి డాక్టర్ గంగిడి మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.


