గురాంపల్లివాసుల స్ఫూర్తిదాయక నిర్ణయం
కోల్సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా గురాంపల్లి గ్రామానికి చెందిన ఒడ్నాల చంద్రయ్య(72) జీవితం నిశ్శబ్దంగా ముగిసింది. కానీ ఆయన పార్థివదేహం వైద్యవిద్యార్థుల చేతుల్లో కొత్త అధ్యాయానికి నాందిపలికింది. ఈనెల 21న కన్నుమూసిన చంద్రయ్యకు కుటుంబసభ్యులు ఎవరూ లేరు. సాధారణంగా జరిగే దహన సంస్కారాల బదులు గ్రామపెద్దలు ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పార్థివదేహాన్ని గోదావరిఖనిలోని సింగరేణి మెడికల్ కాలేజీకి దానం చేశారు. సర్పంచ్ తొగరి సంపత్, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం నేతృత్వంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి వాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈనెల 22న జీజీహెచ్ మార్చురీలో పార్థివదేహాన్ని భద్రపరిచి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో పోలీసుల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ సహా అన్ని ధ్రువపత్రాలు సేకరించారు. మంగళవారం పార్థివదేహాన్ని సిమ్స్ ప్రిన్సిపాల్ నరేందర్ సమక్షంలో అనాటమీ డిపార్మెంట్ హెచ్వొడీ శశికాంత్కు అప్పగించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, చంద్రయ్య పార్థివదేహాన్ని కాల్చకుండా, పూడ్చకుండా వైద్య విద్యార్థుల పరిశోధన కోసం దానం చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. ఇలాంటి నిర్ణయాలు సమాజానికి మార్గదర్శకమన్నారు. సర్పంచ్ సంపత్, మాజీ సర్పంచ్ రాజేశం, సదాశయ షౌండేషన్ ప్రచార కార్యదర్శి వాసు మాట్లాడుతూ.. ఒంటరి జీవితం గడిపిన చంద్రయ్యం చివరికి సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారన్నారు. ఒక గ్రామం తీసుకున్న ఈ స్ఫూర్తిదాయక నిర్ణయం చాలామంది ఆలోచనకు దారి తీస్తుందని అన్నారు. మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ లావణ్య, జీజీహెచ్ సూపరింటెండెంట్ దయాల్సింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ, ఆర్ఎంవోలు కృపాబాయి, రాజు, రేణుక, అనాటామీ హెచ్వోడీ శశికాంత్, ప్రొఫెసర్ కల్పన, సదాశయ ఫౌండేషన్, రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పార్థివదేహాన్ని దానం చేసిన గ్రామపెద్దలు
మెడికోలకు తొలిపాఠంగా మారిన వైనం
గురాంపల్లివాసుల స్ఫూర్తిదాయక నిర్ణయం


