అవగాహనే ఔషధం
కరీంనగర్: ఎయిడ్స్ అంటే భయం. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు శరీరాన్ని వదిలివెళ్లదు. మందులు వాడితే నియంత్రణలో ఉంటుంది గానీ ఆదమరిస్తే తిరగబెట్టి కబళించేస్తుంది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరిగి క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటుచేసింది. ఫలితంగా జిల్లాలో కొన్నేళ్లుగా ఎయిడ్స్ తగ్గుముఖం పడుతూ వస్తోంది. గతంలో కన్నా ప్రస్తుతం కేసులు తక్కువగా కనిపిస్తున్నా.. జిల్లాలో అధికారికంగానే ప్రతినెల 20కి పైగా పాజిటివ్కేసులు నమోదవుతున్నాయి. అనధికారికంగా చాలా మంది వ్యాధిబారిన పడుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం.
నెలనెలా పరీక్షలు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ విభాగం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతో బాధితుల సంఖ్య తగ్గుతోంది. 2019లో 7,906 మందికి పరీక్షలు చేయగా 122 మందికి హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. ఈ ఏడాది నవంబర్ వరకు 6,286 మందికి పరీక్షలు చేయగా 105మందికి హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఏఆర్టీ కేంద్రాల్లో చికిత్స కోసం నమోదు చేసుకున్నవారి సంఖ్య 1,004 మంది కాగా అందరికి మందులు అందజేస్తున్నారు.
అవగాహన ముఖ్యం
హెచ్ఐవీ అని తెలియగానే సీడీ–4 కణాల సంఖ్య తగ్గేంత వరకూ అశ్రద్ధ చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో ఆధునిక వైద్యసేవలు పొందితే 75 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవనం సాగించొచ్చు. ఎయిడ్స్ రోగులూ మధుమేహం, బీపీ, ఆస్తమా రోగుల మాదిరిగానే ఔషధాల వాడకం ద్వారా మంచి ఆరోగ్యం పొందొచ్చు. హెచ్ఐవీ ఉన్న దంపతులు తగిన సమయంలో ఏఆర్టీ మందులు వాడి ఆ రోగం లేని పిల్లలకు జన్మనివ్వొచ్చు.
రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి
హెచ్ఐవీ బాధితులు ఉదయం 3 కిలోమీటర్లు నడిచి, 15 నిమిషాల పాటు ధాన్యం చేయాలి. గ్లాస్ పాలు, బ్రెడ్, ఉడికించిన గుడ్డు తీసుకోవాలి. రోజు రాగి జావా, అంబలి తాగాలి. మధ్యాహ్నం భోజనంలో తాజా కూరగాయలు, ఆలు దుంపలు, ఆకు కూరలు, పప్పు దినుసులు, నాన్వెజ్ తీసుకోవాలి. సాయంత్రం ఆపిల్, దానిమ్మ, అంగూర, అరటి పండ్లు, ఫైనాపిల్, సపోట తినాలి. గోధుమ రవ్వ పాలలో కలిపి ఉడికించి ఆరగించాలి. రాత్రి భోజనంలో తాజా కూరగాయలు, రెండు చపాతీలు, నిద్రించే సమయంలో వేడి చేసి చల్లార్చిన నీరు తాగిలి.
ఎయిడ్స్ బారిన యువత...
హెఐవీ కేసుల్లో యువత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే 70 శాతం వరకు హెఐవీ వ్యాధి బారినపడుతున్నారు. మద్యానికి బానిస కావడం, మత్తు పదార్థాలు సేవించడం, సురక్షితం లేని శృంగారంలో పాల్గొనడం, తగు జాగ్రత్తలు పాటించకపోవడవమని వైద్యులు చెబుతున్నారు.
తగ్గుతున్న మరణాల సంఖ్య...
జిల్లాలో ఎయిడ్స్ బారిన పడి మృతి చెందే వారి సంఖ్య తగ్గుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 105 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో హైరిస్క్ ప్రవర్తన కలిగిన వ్యక్తులు, ఫీమేల్ సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్ జెండర్ల తరపున స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ వారి ప్రవర్తనలో మార్పునకు యత్నిస్తున్నాయి. మంచి మందులు అందుబాటులో ఉండడంతో మరణాల సంఖ్య తగ్గింది. ఎయిడ్స్ వ్యాధి బాధితుల కోసం జిల్లా ఆస్పత్రిలో ఐసీటీసీ కేంద్రం, హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, చల్మెడ మెడికల్ కళాశాలలో ఏఆర్టీ కేంద్రాలు ఉన్నాయి.
(ఇప్పటివరకు)
జిల్లాలో ఎయిడ్స్ కేసులు ఇలా
సంవత్సరం టెస్టులు పాజిటివ్ శాతం 2019–20 7,906 122 1.5
2020–21 3,244 152 4.5
2021–22 3,892 120 3.0
2022–23 8,005 135 1.6
2023–24 10,836 218 2.0
2024–25 10,710 152 1.4
2025–26 6,286 105 1.6
గతేడాది స్టేట్ అవార్డు
ఎయిడ్స్ నిర్మూలనకు విస్తృతంగా చేపడుతున్న కార్యక్రమాలతో జిల్లా ప్రథమస్థానంలో నిలవడంతో గతేడాది స్టేట్ అవార్డు వచ్చింది. వ్యాధి నియంత్రణలో ఉంచేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలను గుర్తించి అవార్డు అందజేశారు. హెచ్ఐవీ బాధితులకు ఏఆర్టీ సెంటర్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. వారికి కావాల్సిన మందులు ఇవ్వడంతో పాటు సీడీ–4, వైరల్ లోడ్పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నాం. హెచ్ఐవీ నియంత్రణ మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి.
– ఎం.సదానందచారి, ఐసీటీసీ కౌన్సిలర్, కరీంనగర్
అవగాహనే ఔషధం


