స్వామివారి దర్శనానికి క్యూలో ఉన్న భక్తులు
ఆలయ ఆవరణలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
● భారీగా తరలివస్తున్న భక్తులు ● పోటెత్తిన స్వామివారి సన్నిధి
● నేడు హనుమాన్ చిన్న జయంతి ● ఉత్సవాలు ప్రారంభించిన ఈవో అంజనా రెడ్డి
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయ స్వామివారి చిన్న జయంతి సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎటుచూసినా కాషాయ దుస్తులు ధరించిన దీక్షాపరుల సందడి కనిపిస్తోంది. బుధవారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన పెద్ద ఎత్తున స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్తోపాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు జై హనుమాన్.. జైశ్రీరామ్.. నినాదాలతో కొండగట్టుకు తరలివస్తున్నారు. వీరంతా అర్ధరాత్రి తర్వాత దీక్ష విరమణ చేయనున్నారు. చిన్న జయంతికి తరలివచ్చే భక్తులకు అన్ని రకాల మందులు, వైద్య సేవలు అందుబాటులో ఉంచామని డీఎంహెచ్వో సుజాత తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గుట్టపై వివిధ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. ఐదుచోట్ల 108అంబులెన్స్లు అందుబాటులో ఉంచామని మండల వైద్యురాలు మౌనిక, ఆరోగ్య సిబ్బంది తెలిపారు.
ఈదురుగాలులకు కూలిపోయిన చలువ పందిళ్లు
కోనేరు సమీపంలో వేసిన చలువ పందిళ్లు ఈదురుగాలులకు కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాకపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. పలువురికి గాయాలైనట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ ఈవో అంజనారెడ్డి స్పందించారు. ఈదురుగాలులకు పందిళ్లు కూలిపోయింది నిజమే అయినా.. భక్తులెవరికీ ప్రమాదం జరగలేదని, పుకార్లు నమ్మవద్దని కోరారు.
కొండగట్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
జయంతి సందర్భంగా ఆలయ ఆవరణలో బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఎస్పీ అశోక్కుమార్ ఆదేశాల మేరకు ఆలయ పరిసరాలు, ప్రవేశ ద్వారాలు, భక్తుల రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.


