జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, జేఏసీ నేత ఎన్నమనేని శ్రీనివాస్రావు (65) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. శ్రీనివాస్రావు తెలంగాణ సాధన కోసం అనేక ఉద్యమాలు చేశారు. మొదటిసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించి పట్టణంలోని కొత్తబస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేయించారు. ఆయన మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
పురిట్లోనే శిశువుకు గాయాలు
మెట్పల్లి: ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డకు గాయాలయ్యాయని ఉదయ్ అనే వ్యక్తి ఆరోపించాడు. పట్టణంలోని వెంకట్రావ్పేటకు చెందిన భవానీని గత నెల 29న ప్రసవం కోసం కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు అదేరోజు శస్త్ర చికిత్స చేసి పురుడు పోశారు. పుట్టిన శిశువు ఓ చేయి వాపుతోపాటు పలు చోట్ల గాయాలు ఉండడాన్ని గమనించిన తండ్రి ఉదయ్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. అందులో చేయి విరిగిందని తేలడంతో అందోళన చెందిన ఆయన ప్రభుత్వ వైద్యులను నిలదీశాడు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువుకు గాయాలయ్యాయని, బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
సంఘ గళమే ఉద్యోగుల బలం
● టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్
కరీంనగర్ అర్బన్: సంఘ గళమే ఉద్యోగుల బలమని, సంఘటిత పోరాటాలే ఉద్యోగుల ఆయుధమని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. ఉద్యోగులు జీవితాంతం చేసిన సేవలకు గౌరవంగా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ఆలస్యం చేయకుండా వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. టీఎన్జీవోల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నికై న మారం జగదీశ్వర్ను సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక టీఎన్జీవో భవన్లో అట్టహాసంగా సన్మానించారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై న రాగి శ్రీనివాస్, రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీగా ఎన్నికై న సర్దార్ హర్మీందర్ సింగ్ను ప్రత్యేకంగా సన్మానించారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, పరిరక్షణపై విస్తృతంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈనెల 7న జరగనున్న జేఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలిపారు. కోశాధికారి కిరణ్కుమార్రెడ్డి, నాయకులు ఎంఏ హమీద్, సుద్దాల రాజయ్యగౌడ్, నాగేందర్రెడ్డి, అమరేందర్రెడ్డి, జావిద్ అలీ, పెండ్యాల కేశవరెడ్డి, మారుపాక రాజేశ్ భరద్వాజ్, సందీప్రావు, సుమంత్రావు, ఏవీ రాజేశ్వరరావు, పోలు కిషన్, రమేశ్గౌడ్ పాల్గొన్నారు.


