
మొగిలిపేటలో కుల బహిష్కరణ
మల్లాపూర్(కోరుట్ల): కుల సంఘంలో ఓ నలుగురు పెద్ద మనుషులు చెప్పిన మాట వినలేదని.. ఓ మహిళా కుటుంబాన్ని కులబహిష్కరణ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం మండలంలోని మొగిలిపేటలో ముదిరాజ్ కులానికి చెందిన ఓనవేని నర్సయ్య–భూమక్క దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు ఓనవేని దశరథం–సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. దశరథం ఇంటి అమ్మకానికి సంబంధంచి 2018లో అదే కులానికి చెందిన ఒకరితో గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదం పరిష్కారానికి కులసంఘం పెద్దల వద్దకు వెళ్లారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అదే సంవత్సరం కులబహిష్కరణ చేశారు. దశరథం కుటుంబంతో ఎవరైనా వారితో మాట్లాడటం, వారి ఇంటికి వెళ్లడం లాంటివి చేయొద్దని హెచ్చరించారు. స్థానిక పోలీస్స్టేషన్లో దశరథం భార్య సుజాత ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. అప్పటి నుంచి దశరథం కుటుంబం తీవ్ర మనస్థాపానికి గురవుతూ ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది దశరథం ఉపాధి కోసం గల్ఫ్కు వలస వెళ్లగా, కుల బహిష్కరణ కేసుతో ఇబ్బంది పడుతున్న పెద్దలు అతని భార్య సుజా త కేసును వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెస్తున్నారు. కులపెద్దల మాటను ధిక్కరించినందుకు సుజాత కులసభ్యులందరి కాళ్లు మొక్కి క్షమించాలని వేడుకుంటే తిరిగి కులంలోకి చేర్చుకుంటామని సమాచారం పంపించారు. క్షమాపణ అడగబోనని సుజాత చెప్పడంతో 15 రోజుల క్రితం కులసంఘంలోని ఓ నలుగురు పెద్దలు ఆ కుటుంబంతో ఎవరు మాట్లాడినా రూ.50వేల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారని, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.