
కార్యదర్శులపై పండుగ భారం
కరీంనగర్రూరల్: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్నచందంగా మారింది జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి. బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్లు పంచాయతీ కార్యదర్శులే చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో ఆందోళన చెందుతున్నారు. జీపీల్లో నిధుల కొరత వెక్కిరిస్తుండగా అధికారుల ఒత్తిళ్లతో సొంత డబ్బులు వెచ్చించి పనులు చేయిస్తున్నారు. జిల్లాలోని 318 గ్రామపంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన 2024 ఫిబ్రవరి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం లేదు. ఇంటి, నల్లా, వాణిజ్య సముదా యాల పన్ను వసూలు చేసి ఖజానాలో జమ చేసిన అనంతరం నిధులు విడుదల చేసుకునే అవకాశం లేకుండా పోయింది. పారిశుధ్య ట్రాక్టర్లకు డీజిల్, మరమ్మతులకు వారానికి రూ.1000 నుంచి రూ.2 వేల వరకు కార్యదర్శులు వెచ్చిస్తున్నారు. స్ట్రీట్లైట్ల నిర్వహణ, పారిశుధ్య పనులు, బోర్లు, పైపులైన్ల లీకేజీల మరమ్మతులకు నెలకు రూ.10వేల వరకు సొంతంగా ఖర్చు పెడుతున్నారు.
పండుగల నిర్వహణ ఎలా?
గ్రామ పంచాయతీల్లో నిధులు లేకుండా బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణకు ఏర్పాట్లు ఎలా చేయాలంటూ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ గ్రామంలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకంగా వీధిలైట్లు, ప్రధాన చౌరస్తాలతో పాటు బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో ఫ్లడ్లైట్లు, సీరియ ల్ బల్బులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చిన్న గ్రామాల్లో రూ.30వేల నుంచి రూ.40వేలు, పెద్ద గ్రామాల్లో రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు విద్యుత్లైట్లకు ఖర్చు చేయాల్సి వస్తుందని కార్యదర్శులు పేర్కొంటున్నారు. దసరా రోజున శమీపూజ ఇతర కార్యక్రమాలకు ఒక్కో గ్రామపంచాయతీలో రూ.2 వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు గ్రామాల్లో బతుకమ్మ ఆడే మైదానాలను చదును చేయిస్తున్నారు. రోడ్లపై గుంతలను మట్టి, డస్ట్పోసి పూడ్చివేస్తున్నారు. డ్రైనేజీల్లోని సీల్టు తొలగిస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా ఎలా ఏర్పాట్లు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పండుగల నిర్వహణకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.