పెట్టుబడికి రూ.లక్ష అప్పుజేసిన
బోర్లు ఎత్తిపోతున్నాయ్
● ఎల్నినో ప్రభావంతో తగ్గిన వర్షపాతం
● దిక్కులు చూస్తున్న రైతులు
మాచారెడ్డి: ఎల్నినో ప్రభావంతో జిల్లాలో వర్షపాతం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో కరువుఛాయలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. గతేడాది ఇప్పటివరకు జలాశయాలు నిండి వరి నాట్లతో బిజీ బిజీగా ఉన్న రైతాంగం నేడు కొన్ని చోట్ల దుక్కులు దున్ని దిక్కులు చూడాల్సి వస్తోంది. వర్షాధారంపై ఆశలు వదులుకున్న రైతులు బోరుబావుల వద్ద సాగుకు సన్నద్ధమయ్యారు. ఈ సారి సరైన వర్షాలు లేకపోవడంతో బోర్లలో సైతం నీటి మట్టం తగ్గి అన్నదాత అయోమయంలో పడిపోయే ప్రమాదం దాపురించింది. కొండంత ఆశతో ఇప్పటికే యూరియా యాప్తో ఆపసోపాలు పడి యూరియా సమకూర్చుకున్న రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు.
బోసిపోతున్న జలాశయాలు
గతేడాది ఇప్పటివరకు జలాశయాల్లోకి కొత్త నీరు వచ్చి చేరింది. కానీ ఈ సారి ఆశించినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో చెరువులు, కుంటలు బోసిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభంలో కురియడంతో అన్నదాతలు తుకాలు పోశారు. అప్పులు జేసి యూరియాతోపాటు దుక్కి విత్తనాలు కొనుగోలు చేశారు. కార్తెలన్నీ కరిగి పోతుండటంతో సరైన వర్షాలు పడక తుకాల్లోని వరి నారు ముదిరిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోహిణి, మృగశిర కార్తె ప్రారంభంలో వర్షాలు పడటంతో కాలం బాగా అవుద్దని, ఎరువులు విత్తనాల కోసం రూ.లక్ష అప్పు చేయాల్సి వచ్చింది. వర్షాలు లేక బోరు బావి వద్ద ఆరెకరాలకు గానూ మూడెకరాల్లో సాగు చేస్తున్నా. వర్షాలు పడకపోతే ఆ మూడెకరాలు కూడా చేతికి రాకుండా పోతుంది.
–అంజల్రెడ్డి, రైతు, చుక్కాపూర్
వర్షాలు లేక ఇప్పుడే బోర్లు ఎత్తి పోతున్నాయ్. పోయిన సారి పదెకరాల నాటేసిన. ఈ సారి నాలుగెకరాలు కూడా పారేట్టు లేదు. ముందే తుకాలు పోయడం వల్ల ఎరువులు, విత్తనాలు తెచ్చి పెట్టిన. వర్షం కోసం ప్రతి రోజు మొగులును చూడాల్సి వస్తుంది.
– రాజు, బండరామేశ్వరపల్లి, పాల్వంచ


