‘భారత్ను విశ్వగురు స్థానంలో నిలబెట్టాలి’
భిక్కనూరు: భారతమాతను విశ్వగురువు స్థానంలో నిలబెట్టడంలో ఉపాధ్యాయులు, విధ్యార్థులు కీలక పాత్ర పోషించాలని తపస్ రాష్ట్ర కార్యదర్శి పుల్గం రాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిప్పాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘కర్తవ్య బోధ్ దివస్’ నిర్వహించారు. స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు జాతీయభావం, నైతిక విలువలను పెంపొందించుకునేందుకు ఉపాధ్యాయులు చేయూతను అందించాలన్నారు. చిన్నతనం నుంచే సంస్కృతి సంప్రదాయలపై గౌరవాన్ని పెంచుకోవాలన్నారు. దేశ సంరక్షణకు ముందుండాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం యాదగిరి, ఉపాధ్యాయులు వాణిశ్రీ, విష్ణుప్రియ, ఉమారాణి, నర్సింహారెడ్డి, సురేష్, అజ్జు పయాజ పాల్గొన్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్సలాం సూచించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీలను సందర్శించారు. కాలేజీల్లో జరుగుతున్న ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇంటి వద్ద బాగా చదువుకుని పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. అధ్యాపకులు ఎప్పటికప్పుడు విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం, కస్తూర్భా కాలేజీ ప్రత్యేకాధికారి శిల్ప, అధ్యాపకులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 9,059 మంది విద్యార్థులకుగాను 8,750 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరు శాతం 96.59గా నమోదుయ్యింది. పరీక్షలను ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం పర్యవేక్షించారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాలో 11 కంది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిచ్కుంద, పుల్కల్, మద్నూర్, డోంగ్లీ, పిట్లం, గాంధారి, ఉత్తునూర్, పద్మాజీవాడి, జుక్కల్, ఆర్గొండ, దోమకొండల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తేమ శాతం 12 కు మించకుండా, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ తీసుకువచ్చే కందులకు క్వింటాలుకు రూ.8 వేల మద్దతు ధర లభిస్తుందని తెలిపారు.
నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ధర్మారెడ్డి బీట్ ఏరియాలో బుధవారం అటవీ శాఖ అధికారులు జంతుగణన ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి వాసుదేవ్ మాట్లాడుతూ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్(ఏఐటీఈ)లో భాగంగా ప్రతి నాలుగేళ్లకోసారి అటవీ ప్రాంతంలో జంతు గణన ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఆర్వో రవికుమార్, సిబ్బంది, ఎల్లారెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
‘భారత్ను విశ్వగురు స్థానంలో నిలబెట్టాలి’
‘భారత్ను విశ్వగురు స్థానంలో నిలబెట్టాలి’


