
రేవంత్ పాలనలో దిగజారిన రాష్ట్ర పరిస్థితి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పదేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమంలో అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రం పరిస్థితి దిగజారిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. శుక్రవారం కామారెడ్డిలో మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, జాజాల సురేందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉండగా తలసరి ఆదాయం దేశంలో ఒకటో స్థానంలో ఉంటే, ఇప్పుడు 11వ స్థానానికి పడిపోయిందన్నారు. జీఎస్డీపీ వృద్ధిలో మూడో స్థానంనుంచి 14 వ స్థానానికి దిగజారిందన్నారు.
మోసపూరిత హామీలపై నిలదీస్తాం..
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి అన్ని వర్గాలను వంచించాడని ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 11 వేలు మాత్రమే ఇచ్చారని, తాము అధికారంలో ఉన్నపుడు ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్షలు, నిర్వహించిన ఇంటర్వ్యూలను కూడా వారి ఖాతాలో జమ చేసుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే బహిరంగ సభ ద్వారా కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ మోసాలు, వంచనను ఎండగడతారన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 వాగ్దానాల అమలు కోసం సర్కారుపై ఒత్తిడి పెంచడానికే సభ నిర్వహిస్తున్నామన్నారు. సభకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 40 వేల మంది తరలిరానున్నారని వివరించారు. ఉమ్మడి జిల్లా నుంచి 250 ఆర్టీసీ బస్సులు, 264 ప్రైవేటు బస్సులు, 626 తుఫాన్లు తదితర వాహనాలు, 1,266 సొంత వాహనాలతో తరలివెళ్తామన్నారు. వడ్లను కొనుగోలు చేయడంలో తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు మనోహర్రెడ్డి, కుంబాల రవి, కపిల్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రమేశ్, హఫీజ్, లక్ష్మీనారాయణ, బల్వంతరావ్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి సభలో సర్కారును
కేసీఆర్ నిలదీస్తారు
సభకు ఉమ్మడి జిల్లా నుంచి
40 వేల మందిని తరలిస్తాం
మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి