● అడుగంటుతున్న భూగర్భ జలాలు
● ఎత్తిపోతున్న బోరుబావులు
● ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్న అన్నదాతలు
రామారెడ్డి: మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి అప్పుడే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో బోర్లలో నీటి ఊట తగ్గిపోయి పంటను కాపాడుకోవడం అన్నదాతకు కష్టంగా మారుతోంది. నీరందక ఎండుతున్న పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు రామారెడ్డికి చెందిన పలువురు రైతులు. ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చి పంటకు అందిస్తున్నారు. యాసంగిలో మూడెకరాలలో వరి వేశానని రామారెడ్డికి చెందిన రైతు రవి గౌడ్ తెలిపారు. పంట పొట్ట దశలో ఉందని, ఈ సమయంలో బోరు ఎత్తిపోవడంతో ట్యాంకరు ద్వారా నీరు తెప్పించి పోస్తున్నానని పేర్కొన్నారు. రామారెడ్డికే చెందిన రాజయ్య బోరు కూడా ఎత్తిపోవడంతో ఆయన సైతం ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.


