● ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ఘనంగా అటవీ, పిచ్చుకల దినోత్సవం
కామారెడ్డి క్రైం: ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, అడవుల సంరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం ప్రపంచ అటవీ, పిచ్చుకల దినోత్సవాలను పురస్కరించుకుని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అటవీ శాఖ కార్యాలయం నుంచి డిగ్రీ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన రోజున ఒక మొక్క నాటడాన్ని అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పిచ్చుకల సంరక్షణపైనా దృష్టి సారించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు ముందుండాలని ఎస్పీ పిలుపునిచ్చారు. అనంతరం అటవీ సంరక్షణ, పరిరక్షణ పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎఫ్వో నిఖిత, ఏఎస్పీ చైతన్యరెడ్డి, పోలీసు, అటవీ శాఖల అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


