జిల్లాలో గ్రామ సింహాలు భయపెడుతున్నాయి. దీంతో కుక్కకాటు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం 2023 సంవత్సరంలో 721 కేసులు నమోదు కాగా, 2024 లో 761 కేసులయ్యాయి. గతేడాది 802 మంది కుక్క కాటుకు గురయ్యారు. ఈ ఏడాది జనవరిలో 75, ఫిబ్రవరిలో 57, మార్చిలో ఇప్పటివరకు 34 కేసులు నమోదయ్యాయి. రికార్డులకెక్కని కేసులు వందల్లో ఉంటాయని తెలుస్తోంది.
చీకటి పడితే మరింత రెచ్చిపోతున్న శునకాలు
పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా కుక్కలు పెరిగిపోయాయి. జనావాసాల మధ్య విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలు... రాత్రి వేళల్లో మరింత రెచ్చిపోతున్నాయి. రోడ్డువెంట వెళ్తున్నవారిపై దాడి చేస్తున్నాయి. వాహనాల వెంట పడుతూ వాహనదారుల్లో దడ పుట్టిస్తున్నాయి. కుక్కలను తప్పించుకుని వెళ్లే క్రమంలో వాహనం అదుపుతప్పి పలువురు పడిపోయిన ఘటనలూ ఉన్నాయి. శివారు కాలనీల్లో రాత్రి వేళల్లో జనం బయటి రావాలన్నా, బయటినుంచి ఇంటికి వెళ్లాలన్నా బయపడే పరిస్థితులున్నాయి.
ఏబీసీ (ఆనిమల్ బర్త్ కంట్రోల్) జిల్లాలో నామమాత్రంగానే సాగుతోంది. వీధి కుక్కలకు సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేయడంలో జాప్యం వల్ల వాటి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రజలు కుక్క కాటు బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డిని వివరణ కోరగా వీధి కుక్కల సంతానోత్పత్తి నియంత్రణపై కౌన్సిల్లో చర్చిస్తామని పేర్కొన్నారు.
కామారెడ్డి క్రైం: జంతువుల్లో జనన నియంత్రణ కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో పశుసంవర్ధక, మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. చిన్నారులు కుక్క కాట్లకు గురవుతున్న నేపథ్యంలో జంతు జనన నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు. మందులు అందుబాటులో లేకపోతే వెంటనే కొనుగోలు చేసి రెండు రోజుల్లోగా నియంత్రణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. ఆనిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) కార్యక్రమాన్ని ముందుగా దోమకొండ మండల కేంద్రంలో ప్రారంభించాలని సూచించారు.
జిల్లాలో గ్రామ సింహాల స్వైరవిహారం
పిక్కలు పీకుతున్న వీధి కుక్కలు
మూడేళ్లలో 2,450
కుక్కకాటు కేసులు నమోదు
వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న జనం


